– రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్కు మద్దతు ఇవ్వడం వింత
– ఆటోలతో ర్యాలీ నిర్వహించిన జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 18: తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీసీల బంద్కు మద్దతుగా ఆటోలతో ర్యాలీగా బయల్దేరి హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి మాట్లాడారు. గంటపాటు ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని.. రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించటం నవ్వులాటగా ఉందని ఎద్దేవా చేశారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీలు బంద్ కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీసీ బిడ్డలను స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జాగృతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, బీసీ బంద్ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నట్లు తెలిపారు. బీసీల రిజర్వేషన్లు అమలు చేసేలా టెక్నికల్ గా ప్రభుత్వాలు సరైన వాదనలు వినిపించటం లేదని కవిత విమర్శించారు. ఈ కారణంగానే బీసీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పులు వస్తున్నాయన్నారు. జీ.ఓ 9 విషయంలో కూడా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని, అందుకే కోర్టు జీ.ఓ.ను కొట్టేసిందని అన్నారు. ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరగాల్సినంత తొందర ఏముంది అని ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బంది పెడుతోందని ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పార్టీలు చిత్తశుద్ధిగా పనిచేయాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. మానవహారంలో పాల్గొన్న యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్ మాట్లాడుతూ 78 ఏళ్లుగా బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నారు. కానీ రాజకీయ పార్టీలు బీసీ లను మోసం చేస్తున్నాయి. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ డ్రామాలు చేస్తోంది. రాష్ట్రపతి వద్ద బిల్లును పాస్ చేయించకుండా బీజేపీ కూడా నాటకాలు ఆడుతోంది. బీఆర్ఎస్ కూడా కులగణన చేయకుండా మోసం చేసింది. జూబ్లీహిల్స్ లో బీసీల వోట్ల కోసం కాంగ్రెస్ నాటకం చేస్తోంది. బీసీలు మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దొంగ మాటలు చెప్పే పార్టీలకు బీసీలంతా బుద్ది చెప్పే రోజు వస్తుంది. బీసీలను మోసం చేస్తున్న అన్ని పార్టీలకు రాబోయే రోజుల్లో బుద్ది చెబుతాం. బీసీల పట్ల మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం అని వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





