-సామాజిక న్యాయానికి కట్టుబడివున్నాం
– బీసీలకు 42% రిజర్వేషన్ సాధించేవరకు పోరాటం
– మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
దిల్లీ, ఆగస్టు 6: కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఓ.బి.సి లకు 42% రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి(President of India) ఆమోదించడం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. (captain Uttam Kumar Reddy) ఓ.బి.సి లకు ఉద్యోగ,ఉపాధి, విద్యావకాశాలతో పాటు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు అమలు పరిచేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వందేళ్ల తరువాత కులగణన నిర్వహించిందని ఆయన తెలిపారు. జనాభా నిష్పత్తిలో 56.5% ఓ.బి.సి లు ఉన్నట్లు లెక్కలు తేలడంతో అదే నిష్పత్తి లో 42% రిజర్వేషన్లు అమలు పరిచేందుకు గాను తెలంగాణా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి రాష్ట్ర శాసనమండలి,శాసనసభ ఆమోదం పొంది గవర్నర్ ఆమోదం మీదట రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బిల్లును నెలల తరబడి పెండింగ్ లో ఉండడానికి కేంద్రప్రభుత్వం, బిజెపిలే కారణం అని ఆయన విరుచుకుపడ్డారు. ఓ.బి.సి లకు 42% రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని కోరుతూ తెలంగాణా కాంగ్రెస్ పార్టీ బుధవారం రోజున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్,పి.సి.సి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లతో పాటు మంత్రులు శాసనసభ్యులు,శాసనమండలి,లోకసభ, రాజ్యసభ తదితరులు పాల్గొన్న ఈ ధర్నాను ఉద్దేశించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఓ.బి.సి రిజర్వేషన్లు బిజెపి కి,కేంద్రప్రభుత్వానికి ఇష్టం లేదని స్పష్టం అయిందని ఆయన ఆరోపించారు. అటువంటి బిజెపి పై కేంద్రప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈ ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. రాజ్యాంగంలో దళితులకు, గిరిజనులకు ఉన్న రీతిలోనే ఓ.బి.సి లకు 42%రిజర్వేషన్లు అమలు పరచాలన్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ విజన్ ను అమలులోకి తెచ్చేందుకే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మూలసిద్దాంతం సామాజిక న్యాయం అమలుకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ విజన్ ఆమోదం కోసం ఎన్నో వ్యయప్రయసాలకు వోర్చి తెలంగాణా నలుమూలల నుండి డిల్లీకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు.





