– 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఆర్డినెన్స్
– బీసీలపై చిత్తశుద్ధినినిరూపించుకోండి
– రాష్ట్రపతిని నేరుగా కలసి విన్నవిస్తాం
– బీజేపీ, బీఆర్ఎస్ల కితాబు అవసరం లేదు
– మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
న్యూదిల్లీ, ఆగస్ట్ 7: బీసీలపై(BCs) ప్రేమ ఉంటే బీసీ బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM RevanthReddy) అన్నారు. దిల్లీలో డియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ 42శాతం ఇవ్వాలన్నది తమ కమిట్మెంటని అన్నారు. రిజర్వేషన్ సాధనకోసం తాము చేయాల్సింది చేశామని చెప్పారు. కులగణన, రిజర్వేషన్ల సాధనలో తమ చిత్త శుద్ధిని ఎవరు శంకించలేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వంగా అన్ని విధాల పక్రియ పూర్తి చేశామన్న రేవంత్.. ప్రస్తుతం బీసీల రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలో ఉందన్నారు. కేంద్రం, బీజేపీ కోర్టులో రిజర్వేషన్ల అంశం ఉందన్నారు. వాళ్లకు నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే బీసీ బిల్లును ఆమోదించాలన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడం కోసంబీసీలకు న్యాయమైనా వాటా కోసమే తమ పోరాటమని సీఎం రేవంత్ చెప్పారు. జంతర్ మంతర్ వేదికగా తమ వాణిని బలంగా వినిపించామన్నారు. జంతర్ మంతర్ ధర్నాపై బీజేపీ, బీఆర్ఎస్ నేతల విమర్శలు విడ్డూరమన్నారు. తమ కమిట్ మెంట్ కు వాళ్ల సర్టిఫికేట్ అవసరం లేదని వ్యాఖ్యానించారు రేవంత్. ప్రజలను అబద్ధపు మాటలు చెప్పి మభ్యపెట్టబోమని… అది తమ నైజం కాదన్నారు. బీసీ లకు రాహుల్ ఇచ్చిన మాటను అమలుచేడమే తమ టార్గెట్ అని తెలిపారు. మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉందన్నారు సీఎం రేవంత్. తమ ఆఖరి పోరాటాన్ని పూర్తిచేశాం.. ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రపతికి రాజకీయాలకు సంబంధం లేదన్నారు రేవంత్. కేంద్రం బిల్లుకు ఆమోదించక పోతే.. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా వెళ్లాలో ఆలోచిస్తామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి ప్రజల అభీష్టం మేరకే పార్టీ నిర్ణయం తీసుకుంటాం మన్నారు. లోకల్ బాడీ ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని హైకోర్ట్ చెప్పిందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. బిల్లును రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం సాయంత్రం వరకు వేచి చూస్తాం. రాష్ట్రపతి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం. ఆమె సమయం ఇవ్వలేదంటే ప్రధాని ఒత్తిడి చేసినట్టు భావించాల్సి ఉంటుంది. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఉన్న మార్గాలన్నింటిని ప్రయత్నించాం. కుదరనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్లో స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు మా వద్ద 3 మార్గాలు ఉన్నాయి. 50శాతం సీలింగ్పై గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి జీవో ఇవ్వాలి. జీ.ఒ. ఇస్తే.. ఎవరైనా కోర్టుకు వెళ్తే స్టే వస్తుంది. కాబట్టి జీ.ఒ. ఇచ్చి ఎన్నికలకు వెళ్లే మొదటి మార్గం సాధ్యం కాదు. ఇప్పుడే స్థానిక ఎన్నికలు పెట్టకుండా ఆపడం రెండో మార్గం. స్థానిక ఎన్నికలు ఆపితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగుతాయి. కేంద్ర నిధులు రాకుంటే గ్రామాల్లో వ్యవస్థలు కుప్పకూలుతాయి. మూడో మార్గం పార్టీ పరంగా బీసీలకు 42శాతం సీట్లు ఇవ్వడం. బీసీలకు 42శాతం సీట్లపై ఇతర పార్టీలపైనా ఒత్తిడి తెస్తాం అని సీఎం తెలిపారు. సమయం కూడా తక్కువగా ఉందని అందుకు అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుందని అన్నారు.





