హైదరాబాద్‌ అభివృద్ధికి ఆ ఇద్దరే అడ్డంకి

– బ్యాడ్‌ ‌బ్రదర్స్ ఇద్దరూ మోకాలడ్డుతున్నారు
-ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ‌హయాంలోనే నగరాభివృద్ధి
– హైదరాబాద్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా చేసిన కెటిఆర్‌
-‌ నగరంలో 44 చెరువులను కబ్జా చేసిన బిఆర్‌ఎస్‌ ‌నేతలు
– మూసీ పునరుద్ధ్దరణ, మెట్రో పొగింపులకు కిషన్‌ ‌రెడ్డి అడ్డు
– జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్‌ ‌కూడా రాదు
– ఎన్నిక ఏదైనా తానే రంగంలో ఉన్నట్లుగా భావిస్తా
– వోట్లు వేసి గెలిపిస్తే నగరాభివృద్ధికి పెద్ద పీట
– మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబరు 7: రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్‌ ఎక్కువగా అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీలో 2004-2014 మధ్య  కాలంలోనే రాష్ట్రంలో అభివృద్ధి అన్నది కనిపించిందన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓఆర్‌ఆర్‌, ‌శంషాబాద్‌ ‌విమానాశ్రయం, మెట్రో రైలు.. ఇవన్నీ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే తీసుకువొచ్చిందన్నారు. 2014 నుంచి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్‌ రాష్ట్రానికి చేసింది శూన్యం. హైదరాబాద్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 2014లో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2023లో కేసీఆర్‌ ‌తెలంగాణను రూ.8లక్షల కోట్ల అప్పుల్లో పెట్టి మళ్లీ కాంగ్రెస్‌కు అప్పగించారు. హైదరాబాద్‌కు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్‌ను రద్దు చేసింది ఎవరని అన్నారు. ఐటీఐఆర్‌ ‌కూడా మంజూరు చేసి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది ఉండేదన్నారు. వరదలు వొచ్చి హైదరాబాద్‌ ‌ముగినిపోతే కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి వరద సాయంగా రూపాయి కూడా తేలేదన్నారు. హైదరాబాద్‌లో 44 చెరువులను నేతలు కబ్జా చేశారు. అంబర్‌పేటలో బతుకమ్మకుంటను ఆ పార్టీ అంబర్‌పేట ఇన్‌ఛార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి ఆక్రమించారు. చెరువుల్లోని కబ్జాలను తొలగించి పునరుద్ధరిస్తే.. దానిపై రాజకీయం చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో సబర్మతి ప్రక్షాళన చేసుకున్నారు.. యూపీలో నది ప్రక్షాళన చేశారు. అహ్మదాబాద్‌లో కొత్త నగరం కట్టుకున్నారు.. రాష్ట్రంలో అడ్డుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్‌ ‌వల్లే నగరం అభివృద్ధి చెందింది. ఇప్పుడూ కాంగ్రెస్‌ను గెలిపిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయి. అభివృద్ధి పనుల వల్ల పేదలకు నష్టం జరిగితే ఆదుకుంటాం. ఇళ్లు కోల్పోయిన పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం. ప్రజలను వోటు అడుగుతున్నా..  వోటు ద్వారా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందాం అని సీఎం విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్‌ హయాంలో కాళేశ్వరం, కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌, ‌సచివాలయం, ప్రగతి భవన్‌ ‌నిర్మించారు. కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని, వాస్తు సరిగా లేదని బాగున్న సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది నిర్మించారు. పేదలకు ఆ సచివాలయం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? కొత్త ఉద్యోగాలు ఏమైనా వొచ్చాయా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు, మీడియా ప్రతినిధులపై నిఘా పెట్టేందుకు కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఎవరికీ అనుమతి లేని విలాసవంతమైన భవనాలు మాత్రమే నిర్మించారు.  రైతు కోసమని కట్టిన కాళేశ్వరం మాత్రం మూడేళ్లకే కూలింది. పదేళ్లలో మెట్రో రైలును కొత్తగా కిలోమీటరు కూడా పొడిగించలేదు. మంజూరైన పాత బస్తీ మెట్రోను కూడా పక్కకు పెట్టారు.మెట్రో నిర్మించిన ఎల్‌ అం‌డ్‌టీ నష్టాలకు కూడా బీఆర్ఎస్‌ కారణం అని సిఎం అన్నారు. 2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు కావస్తోంది. భవిష్యత్‌ ‌ప్రణాళికలు ఎలా ఉండాలో విజన్‌ ‌డాక్యుమెంట్‌ ‌తయారు చేస్తున్నాం. మెట్రో విస్తరణకు రూ.43వేల కోట్లతో ప్రణాళికలు కేంద్రానికి ఇచ్చాం. ఆనాడు హైదరాబాద్‌ అభివృద్ధి కోసం కొట్లాడిన శశిధర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డిని హైదరాబాద్‌ ‌బ్రదర్స్ అనే వాళ్లు. నేడు హైదరాబాద్‌ అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ను బ్యాడ్‌ ‌బ్రదర్స్ అం‌టున్నారు. వీరిద్దరూ కలిసి మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు, ఫ్యూచర్‌సిటీని అడ్డుకుంటున్నారు. గోదావరి జలాలు 20 టీఎంసీలు హైదరాబాద్‌ ‌నగరానికి తేవాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారు. హైదరాబాద్‌లో నిర్మించాలనుకున్న ఫ్లైఓవర్లు, అండర్‌ ‌పాస్‌లు, ఎలివేటెడ్‌ ‌కారిడార్లకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. 30 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న కంటోన్మెంట్‌ ‌నుంచి శార్‌పేట, మేడ్చల్‌కు ఎలివేటెడ్‌ ‌కారిడార్లకు అప్రూవల్‌ ‌తెచ్చి రూ.5వేల కోట్లతో పనులు ప్రారంభించాం. ఉత్తర తెలంగాణ మొత్తం ఈ రెండు ఎలివేటెడ్‌ ‌కారిడార్లపైనే ఆధారపడి ఉంది. పదేళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి.. వాటి అనుమతులకు ప్రయత్నం చేయలేదని అన్నారు.  వరంగల్‌, ఆదిలాబాద్‌ ‌విమానాశ్రయాల నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చాం. అదనంగా కొత్తగూడెం, రామగుండం ఎయిర్‌పోర్టులకు ప్రయత్నాలు చేస్తున్నాం అని రేవంత్‌రెడ్డి తెలిపారు.  కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి 6 నెలలు పార్లమెంట్‌ ఎన్నికలతో గడిచిపోయాయి. ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో పనిచేసింది ఏడాదిన్నర మాత్రమే. ఏడాదిన్నరలోనే రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చాం. రూ.లక్ష కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్‌ఆర్‌ను కేవలం రూ.7వేల కోట్లకు బీఆర్ఎస్‌ ప్రభుత్వం అమ్ముకుంది. దీపావళి రోజు కూడా ఇళ్లలో డ్రగ్స్‌తో పట్టుబడిన వారిని ఏమనాలన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో  బీజేపీకి డిపాజిట్‌ ‌రాదని రాసిపెట్టుకోవాలని సీఎం రేవంత్‌ అన్నారు. బీజేపీ ఓడితే హిందువులంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఒప్పుకుంటారా, బండి సంజయ్‌ ‌దీనిని రెఫరెండంగా భావిస్తారా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ‌లో  బీజేపీ గెలవాలని కిషన్‌ ‌రెడ్డికే లేదన్నారు. బీఆర్‌ఎస్‌ ‌ను ఓడించండి..బీజేపీ డిపాజిట్‌ ‌గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు రేవంత్‌. ఏ ఎన్నికనైనా తాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటానన్నారు రేవంత్‌.. ‌పార్టీ అభ్యర్థి ఉన్నచోట తాను పోటీలో ఉన్నట్లే ఫీలవుతా.. కేసీఆర్‌ ‌లా ఫామ్‌ ‌హౌస్‌ ‌లో పడుకోవాలా? అని ప్రశ్నించారు.  ప్రతీ ఎన్నిక తమ ప్రభుత్వ పనితీరుకు పరీక్షేనన్నారు. అండగా ఉంటే పదేళ్లలో అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానన్నారు. సర్వేల గురించి తాను మాట్లాడనన్నారు రేవంత్‌..‌డబ్బులిచ్చి సర్వేలు చేయించుకుంటున్నారని ఆరోపించారు.  కిషన్‌ ‌రెడ్డి..కేసీఆర్‌,‌కేటీఆర్‌ ‌లకు లొంగిపోయారని విమర్శించారు. హైదరాబాద్‌ ‌లో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయంటే అవి కాంగ్రెస్‌ ‌తెచ్చినవేనన్నారు. హైదరాబాద్‌ ‌ప్రజలు 2004 నుంచి 2014, 2014 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధిని పోల్చి చూడాలన్నారు.కేసీఆర్‌ ‌హైదరాబాద్‌ ‌కు తెచ్చిన గొప్ప వరాలు..గంజాయి..డ్రగ్స్ అని విమర్శించారు. కేటీఆర్‌ ‌హైదరాబాద్‌ ‌ను డ్రగ్స్ ‌కు అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌కలిసి హైదరాబాద్‌ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. భవిష్యత్‌ ‌కోసం జూబ్లీహిల్స్ ‌ప్రజలు విజ్ఞతతో  ఆలోచించి వోటెయ్యాలని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *