రేవంత్‌రెడ్డి ఆదేశాల‌తోనే దాడి

– బీహార్ గ్యాంగ్‌ను త‌ల‌పిస్తున్న కాంగ్రెస్ నాయ‌కులు
– గూండాల‌తో దాడి చేయించ‌డ‌మేనా ప్ర‌జాపాల‌న‌
– కేసీఆర్ క్యాంప్ కార్యాల‌యంపై దాడిని ఖండించిన హ‌రీష్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 4: ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిని మాజీ మంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని ఆరోపించారు. పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్‌ను తలపిస్తోంద‌ని అన్నారు. ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాల పైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా? కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై, ప్రజా సంఘాలపై, మీడియాపై దాడులు నిత్యకృత్యం కావడం సిగ్గుచేటన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదు ప్ర‌శ్నించారు. ఒకవైపు హేట్ స్పీచ్ బిల్ పేరుతో ప్రజలు, ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ మరోవైపు కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించడమేనా మీ ప్రజా పాలన.. ఇందిరమ్మ రాజ్యం అని చెబుతూ గూండా రాజ్యం అమలు చేస్తారా.. సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ పాలనను గాలికి వదిలేశారా అని నిల‌దీశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉంటే ఇక్కడ పాలనను ఎవరు చూస్తారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని సందేశాలు ఇచ్చారా.. కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా..  ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బిఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు అని స్ప‌ష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటాం, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడులు జరిపిన కాంగ్రెస్ గూండాలను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేస్తున్నామన్నారు .ఇలాంటి దాడులు ఆపకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త అని హరీశ్ హెచ్చరించారు.

 ప్రజల దృష్టి మరల్చేందుకు దాడులు : నిరంజన్‌ ‌రెడ్డి
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విధ్వంసమే పరమవధిగా కొనసాగుతున్న కాంగ్రెస్‌ ‌నాయకులు ఈసారి బీఆర్‌ఎస్‌ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌క్యాంపు కార్యాలయంపై దాడి చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గజ్వేల్‌లోని క్యాంపు కార్యాలయంలోకి చొరబడ్డ కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు  విధ్వంసం సృష్టించారని, కేసీఆర్‌ ‌క్యాంపు కార్యాలయం ప్రభుత్వ ఆస్తి..  దానిని ధ్వంసం చేయడం అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమేనని అన్నారు.  ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్‌ ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంపైనే ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దుండగులను గుర్తించి కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ ఘటనలో పోలీసులు అలసత్వం వహించడం గర్హనీయమన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *