– 18వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు
– పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : రవాణా శాఖ నిబంధనలు ప్రచారం చేసి రోడ్డు ప్రమాదాలను తగ్గించే చర్యలు తీసుకోవడానికి అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపట్టామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అరైవ్-అలైవ్ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోమవారం నుంచి 18వ తేదీ వరకు రోడ్ సేఫ్టీ కోసం పోలీస్, రవాణా శాఖ అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపడుతున్నట్లు, పర్యావరణ పరిరక్షణ కోసం రవాణా శాఖ చర్యలు తీసుకుంటున్నదని, ట్రాఫిక్ నిబంధనల అమలుకు కఠిన చర్యలు తీసుకుంటుందని, ఈ ఆరు రోజుల్లో అన్ని జిల్లాల్లో శాఖాపరంగా సమీక్షలు చేయనున్నట్లు చెప్పారు. ప్రమాదాల నివారణ, ప్రాణ నష్టం లేకుండా చూడటమే కార్యక్రమ లక్ష్యమన్నారు. ప్రమాదం జరిగిన గంట(గోల్డెన్ అవర్)లో హాస్పిటల్లో బాధితుడిని హాస్పిటల్లో చేర్పిస్తే రహవీర్ అవార్డు ఇస్తారన్నారు. చెక్ పోస్టులు ఎత్తివేసి సంస్కరణలు తీసుకొచ్చామని, అన్ని స్కూళ్ళలో విద్యార్థులకు రవాణా నిబంధనలు వివరించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆర్టీసీలో 30 ఏళ్ల సర్వీసులో ఉండి ఒక్క యాక్సిడెంట్ కూడా చేయని వారికి సన్మానం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. రోడ్ సేఫ్టీ సమావేశాలు ప్రతీ జిల్లాలో నిర్వహించాలని ఆదేశించారు.
ఆర్టీసీ విలీనం అంశం కమిటీ దగ్గర ఉన్నది
కాగా, ఆర్టీసీలో సమ్మె విషయంపై మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశం కమిటీ దగ్గర ఉన్నదని, రెండు సమస్యలపై మినహా మిగతా అంశాలపై చర్చించడానికి సిద్ధమని తెలిపారు. సిబ్బందికి సంబధించిన అంశాలు పరిస్కరిస్తామన్నారు. ప్రేరేపిత సమ్మెలకు వెళ్ళవద్దని, పెండింగ్ డీఏ ఇచ్చాం.. పీఆర్సీపై ఆలోచిస్తున్నాం అని మంత్రి పొన్నం చెప్పారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, రమేష్, శివ లింగయ్య, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





