– ఫ్లాట్ల పేరుతో జనానికి కుచ్చుటోపీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో వందల కోట్ల రూపాయలకు త్రిపురా కన్స్ట్రక్షన్ కుచ్చుటోపీ పెట్టింది. దీంతో పోలీసులు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పసుపులేటి సుధాకర్, అతని భార్యను అరెస్ట్ చేశారు. మరోవైపు సుధాకర్ కూతురు, అల్లుడు పరారీలో ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన పసుపులేటి సుధాకర్ 5వ తరగతి వరకే చదువుకున్నాడు. భవన నిర్మాణ కార్మికుడిగా సెంట్రింగ్ మేస్త్రిగా పనిచేశాడు. నెల్లూరులో బతకలేక తెలంగాణకు మకాం మార్చాడు. ఇళ్ల నిర్మాణంలో కిటుకులు నేర్చుకున్నాడు. అంచలంచలుగా ఎదిగాడు. త్రిపురా కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టాడు. కోట్ల రూపాయలు కళ్ళ చూశడు. కావలిలో 100 ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేశాడు. డబ్బుకు కొదవ లేదు కాబట్టి పొలిటీషియన్ కావాలనుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికల్లో పోటీకి చకచక పావులు కదిపాడు. 2019లో జనసేనలో చేరిన సుధాకర్ కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా గెలవలేకపోయాడు. తిరిగి హైదరాబాద్ కు చేరుకొని కొద్ది రోజులు బీజెపీలో చేరాడు. తర్వాత కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తానంటూ టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలతో లాబీయింగ్ చేశాడు. కానీ అవేవి పనిచేయలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే డిపాజిట్ కూడా రాలేదు. 2019, 2024 ఎన్నికల్లో దాదాపు రూ.150 కోట్ల ఖర్చు చేశాడు. అప్పటివరకు తాను సంపాదించిన దానితో పాటు ప్లాట్ల పేరుతో జనం నుంచి వసూలు చేసిన డబ్బును కూడా ఎన్నికలలో ఖర్చు పెట్టేసాడు. ఇంకేముంది జనం ముందు దోషిగా నిలబడ్డాడు. సుధాకర్పై గతంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీంకి బినామిగా పనిచేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే కొందరు ప్రముఖ రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలను అడ్డం పెట్టుకొని త్రిపురా కన్స్ట్రక్షన్ కంపెనీని ఏర్పాటు చేశాడు. అయితే ఫ్లాట్ల విక్రయాల్లో జనం నెత్తిన కుచ్చుటేపి పెట్టేసాడు. దీంతో లబోదిబో అంటున్నారు బాధితులు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.