– కాల్పుల విరమణ తరవాత ఇదే తొలి ప్రయాణం
న్యూదిల్లీ, ఏప్రిల్ 11: యూఎస్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక తొలిసారిగా ఒక భారత రిజిస్టర్డ్ నౌక హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఎల్పీజీ గ్యాస్తో బయలుదేరిన జగ్ విక్రమ్ నౌక శుక్రవారం రాత్రి జలసంధిని దాటినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో మార్చి నుంచి ఇప్పటివరకూ హర్మూజ్ను దాటిన భారత సరకు రవాణా నౌకల సంఖ్య తొమ్మిదికి చేరింది. అంతేకాక ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ జలాల్లో మరో 15 భారత రిజిస్టర్డ్ నౌకలు ఉన్నాయి. ఇవి కూడా త్వరలో హర్మూజ్ను దాటనున్నట్టు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నానికి జగ్ విక్రమ్ నౌక హర్మూజ్కు తూర్పున ఉన్న గల్ఫ్ ఆఫ్ ఒమన్ జలాల్లో ప్రయాణిస్తోంది. ఈ నౌకలో సుమారు 20 వేల టన్నుల ఎల్పీజీ ఉన్నట్టు సమాచారం. మధ్యస్థాయి సరకు రవాణా సామర్థ్యం కలిగిన ఈ నౌక ముంబైలోని గ్రేట్ ఈస్టర్న్ కంపెనీకి చెందినది. మరికొన్ని రోజుల్లో ఈ నౌక భారత్కు చేరుకుంటుంది. గల్ఫ్లో ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచి అనేక నౌకలు హర్మూజ్కు పశ్చిమాన ఉన్న పర్షియన్ గల్ఫ్ జలాల్లో నిలిచిపోయాయి. జగ్ విక్రమ్తో పోలిస్తే రెండింతల సామర్థ్యం ఉన్న గ్యాస్ క్యారియర్లు కూడా వీటిల్లో ఉన్నాయి. ఇక ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్లోని భారత నౌకల్లో ఒక ఎల్పీజీ ట్యాంకర్, నాలుగు ముడి చమురు ట్యాంకర్లు, ఒక ఎలఎన్జీ క్యారియర్, ఒక కెమికల్ ఉత్పత్తుల ట్యాంకర్, మూడు కంటెయినర్ ట్యాంకర్లు, రెండు బల్క్ క్యారియర్లు ఉన్నాయి. మరికొన్ని ట్యాంకర్లకు మరమ్మతులు జరుగుతున్నట్టు సమాచారం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




