ఎన్న‌డూ లేనంత‌గా భ‌క్తుల తాకిడి

– ఇప్ప‌టికే 80 ల‌క్ష‌లు దాటిన భ‌క్తుల సంఖ్య‌
– సమ్మక్క గద్దె సమయానికి కోటికి మించే అవకాశం
– మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

మేడారం, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 29: మేడారం సమ్మక్క–సారక్క మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ -సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మేడారంలో మీడియాతో మాట్లాడిన మంత్రి మాట్లాడుతూ, ఈరోజు దాదాపు 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, సమ్మక్క గద్దెపైకి వచ్చే సమయానికి ఈ సంఖ్య కోటికి మించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి తరలివస్తున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. మేడారం జాతర శాశ్వత అభివృద్ధి కోసం ఇప్పటికే 29 ఎకరాల భూమిని సేకరించామని, మరో 41 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. మొత్తంగా సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో శాశ్వతంగా కాటేజీలు, ఫంక్షన్ హాళ్లు, మరిన్ని మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించనున్నట్లు వివరించారు.

బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్

దక్షిణ భారత కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర ప్రాధాన్యతను మరింత పెంచేందుకు బాసర నుంచి భద్రాచలం వరకు రూ.2,500 కోట్ల వ్యయంతో టెంపుల్ సర్క్యూట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధిలో మేడారం ఆలయాన్ని కూడా భాగంగా చేర్చనున్నట్లు ఆయన ప్రకటించారు. జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం రామప్ప–లక్నవరం–జంపన్న వాగు వరకు పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించే ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని, వాగుపై చెక్‌డ్యామ్‌లు నిర్మించి శాశ్వత నీటి నిల్వకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. మేడారం ప్రాంతానికి ఇప్పటికే ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని, దాని ప్రకారం అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఎకో పార్కుల ఏర్పాటు, పర్యాటక సౌకర్యాల విస్తరణ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని భక్తులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా  ఈ రెండు రోజుల్లోనే 70 నుంచి 80 లక్షల మంది భక్తులు ఇప్పటికే దర్శనం చేసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో అత్యంత తక్కువ సమయంలో ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. గతంలో ఇరుకైన రోడ్ల కారణంగా ఇబ్బందులు ఉండేవని, ఈసారి ఫోర్-లేన్ రోడ్లతో రాకపోకలు చాలా సులభమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో శాశ్వత తాగునీటి వ్యవస్థతో పాటు భారీ సంఖ్యలో శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విస్తృతంగా చెట్ల పెంపకం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. జాతర విజయవంతానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికార యంత్రాంగం మరియు మీడియా మిత్రులకు సీతక్క అభినందనలు  తెలిపారు.శనివారం సాయంత్రం 4 గంటలకు తల్లులు గద్దెల నుంచి తిరిగి వనప్రవేశం చేయనున్నారని, అప్పటివరకు భక్తులు ఓపికతో దర్శనాలు చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *