– శాసనసభలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31: జనాభాపరంగా తగిన ప్రాతినిధ్యం లేని బీసీలకు న్యాయం చేసేందుకు ఇంటింటి సమగ్ర సర్వే చేశామని, శాస్త్రీయంగా కులగణన చేపట్టామని, దీనిపై డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయగా బీసీల వెనబాటుతనం, ప్రాతినిధ్యం ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. వెనుకబడిన తరగతులకు పంచాయతీరాజ్ సంస్థలలో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం తెలంగాణ వెనుకబడిన తరగతులు (గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో రిజర్వేషన్) బిల్లు-2025ను ఆమోదించి చట్టం చేసేందుకు రాష్ట్రపతి ఆమోదానికి పంపామని తెలిపారు. అది ఇంకా ఆమోదం పొందనందున ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ శాతం నిర్ణయించేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 285-ఎ సవరణ కోసం ఆర్డినెన్సును మంత్రివర్గం ఆమోదించిందని సీతక్క చెప్పారు. దీన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపగా ఇంకా ఆమోదం పొందలేదన్నారు. కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయని, మరికొన్ని గ్రామ పంచాయతీలు ఒక మండలంలోనుంచి మరొక మండలానికి మార్పు జరిగాయని, ఈ మార్పుల నేపథ్యంలో ప్రత్యేక కమిషన్ను నివేదిక సవరించమని అభ్యర్థించామన్నారు. డెడికేటెడ్ కమిషన్ అభ్యర్థన మేరకు 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన సమాచారం 26న సమర్పించినట్లు, ఈనెల 30న జరిగిన సమావేశంలో పంచాయతీరాజ్ సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, 2018లోని సెక్షన్ 285-ఎని సవరించి 50% పరిమితిని తొలగించి వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను అందించే బిల్లుకు 30న మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దీన్ని రాష్ట్ర శాసనసభ ఆమోదం కోసం ఉఈరోజు సభలో ప్రవేశపెట్టామన్నారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఈ 2018 పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి బీసీలకు న్యాయం చేయాలని సీతక్క సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





