- నేటి ఉదయం 9.30 నుంచి ప్రారంభం
- 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ప్రకటన
- రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,650 సెంటర్లు
- మొత్తం 5, 09,403 మంది విద్యార్థులు
- పటిష్టమైన ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శుక్రవారం మార్చి 21నుంచి ప్రారంభంకానున్నాయి. మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు పూర్తవుతాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల మాదిరి పదో తరగతి పరీక్షలకు కూడా ఐదు నిమిషాలు గ్రేస్-టైం ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అంటే ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా.. 9:35 వరకు ఆలస్యంగా వొచ్చే విద్యార్థులను అనుమతిస్తామని, ఆ తర్వాత వొచ్చే విద్యార్థులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఇప్పటికే హాల్టికెట్లు విడుదల చేశామని, విద్యార్థులు వెబ్సైట్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,650 సెంటర్లను ఏర్పాటు- చేశారు.
మొత్తం 5, 09,403 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోతున్నట్టు- తెలిపారు. కాంపోజిట్ పేపర్లకు పరీక్షరాసేవారికి మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది తొలిసారిగా పదో తరగతి విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ను ఇస్తున్నారు. విద్యార్థులు ఆ బుక్లెట్లోని పేజీల్లోనే ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది. అడిషనల్ కావాలంటే కూడా ఇస్తారు. పేపర్లు లీకేజీని అరికట్టేందుకు ప్రశ్నపత్రాలపై మొదటి సారిగా క్యూఆర్ కోడ్ను ముద్రిస్తున్నారు. అలాగే తొలిసారిగా ఒక్కో పేపర్పై ఒక యూనిక్ నంబర్ను సైతం ముద్రిస్తున్నారు.
ఈ యూనిక్ నంబర్ ప్రశ్నపత్రంలోని అన్ని పేజీలపై ఉంటుంది. ఇక సైన్స్లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పేపర్లకు పరీక్షలను వేర్వేరుగా రెండు రోజుల్లో నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలను ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకే పరీక్ష జరుగుతుంది. గణితం పరీక్ష రోజున గ్రాఫ్ పేపర్ విడిగా ఇస్తారు. సీఎస్డీవో గదుల్లో సీసీ కెమెరాల నిఘాలోనే ప్రశ్నపత్రాల బండిట్స్ తెరుస్తారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు, సందేహాలుంటే 040-23230942 అనే ఫోన్ నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని, అందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు.



ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే