ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో విప్లవాత్మక మార్పులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వ్యవసాయం, సుస్థిరాభివృద్ధి, పరిపాలన, రవాణా, విద్యా రంగల్లో ఎఐ టెక్నాలజీ
టెక్ దిగ్గజం గూగుల్తో రాష్ట్ర సర్కారు కీలక ఒప్పందం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ తో ఒప్పందం చేసుకుంది. ప్రధానంగా వ్యవసాయం, సుస్థిర అభివృద్ధి, పరిపాలన, రవాణా, విద్య తదితర కీలక రంగాల్లో ఏఐ ఆధారిత సేవలు, పరిష్కారాలు అమలు చేయాలని లక్ష్యంగా ఎంచుకుంది. భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా డిజిటల్ నైపుణ్యాలతో శ్రామిక శక్తిని సన్నద్ధం చేసేందుకు వ్యూహాత్మక సహకారం అందించనుంది. టీ హబ్లో గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గూగుల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గూగుల్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం రైతులకు వ్యవసాయ సంబంధిత ఏఐ ఆధారిత పరిష్కారాలు అందించనుంది. రవాణా సదుపాయాలను మెరుగుపరిచే డేటా ఇంటిగ్రేషన్ సదుపాయాల కల్పనలోనూ భాగస్వామ్యం పంచుకుంటుంది. గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ ద్వారా ఏఐ నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలపై దృష్టి సారిస్తుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ అభ్యసన పద్దతులను ప్రారంభిస్తుంది. గూగుల్ వర్క్ స్పేస్, క్రోమ్ సర్వీసెస్ ను అందిస్తుంది. రైతులకు అవసరమైన ఇన్పుట్, రెడిట్, మార్కెటింగ్ సదుపాయాలన్నీ అనుసంధానం చేస్తూ తెలంగాణ ఓపెన్ అగ్రికల్చర్ నెట్వర్క్ ను ప్రారంభిస్తుంది. గూగుల్ డేటా కామన్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఓపెన్ డేటా యాక్సెస్ను మెరుగుపరుస్తుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ ఏఐ ఆధారిత తెలంగాణ దార్శనికతకు గూగుల్ సహకారం ఎంతగానే ఉపయోగపడుతుంది. అత్యాధునిక ఏఐ టెక్నాలజీ ద్వారా కీలక రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా ఎంచుకున్నాం. మెరుగైన పాలన, ఆర్థిక పురోగతితో పాటు ప్రజా సేవలను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని అనుకున్నాం. ఈ లక్ష్య సాధనలో గూగుల్తో ఒప్పందం కీలకంగా నిలుస్తుంది..’ అన్నారు. గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ కీలక రంగాలలో సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. దేశ డిజిటల్ భవిష్యత్ పట్ల తమ సంస్థ నిబద్ధతను ఈ నిర్ణయం బలోపేతం చేస్తుందన్నారు. ఏఐ ఆధారిత వర్క్ ఫోర్స్ ను పెంపొందించటం, స్టార్టప్ లను ప్రోత్సహించడం, వ్యవసాయం, విద్య లాంటి కీలక రంగాల్లో పని చేయటం ఉత్సాహంగా ఉందని ఆమె పేర్కొన్నారు.



