– సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, ప్రతి పౌరుడికి న్యాయం
– స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై సీఎం, మంత్రులకు అభినందన
– తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశంపై ఎక్స్ వేదికగా ఖర్గే వెల్లడి
– కాంగ్రెస్ అగ్రనేతలతో రెండు గంటలపాటు సిఎం బృందం భేటీ
– మేడారం జాతరపై మంత్రి సీతక్కకు ప్రత్యేక అభినందనలు
న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: సమానత్వంతో కూడిన తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ‘ప్రజల తెలంగాణ’ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణను రూపొందించినట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, ప్రతి పౌరుడికి న్యాయం అందించడం తమ ప్రధాన సంకల్పమని వెల్లడించారు. దిల్లీలోని ఆయన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన కీలక సమీక్షా సమావేశం జరిగింది. పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ కూడా పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తోపాటు మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్, పార్టీ ప్రస్తుత పరిస్థితులు, ఇటీవలి ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులను మల్లికార్జున ఖర్గే అభినందించారు. ముఖ్యంగా మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయం నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
సమగ్ర తెలంగాణ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం
సమావేశానికి సంబంధించిన వివరాలను ఖర్గే తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిందని, రాష్ట్ర నాయకులు, మంత్రులతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా తదుపరి కార్యాచరణపై చర్చించామని, సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, అందరికీ న్యాయం అనే లక్ష్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడి ఆకాంక్షలను సాకారం చేస్తూ సమగ్ర తెలంగాణ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. సుమారు 2 గంటలపాటు భేటీ కొనసాగింది. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం అని ఖర్గే పేర్కొన్నారు. సమావేశంలో మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను అగ్రనేతలు అభినందించారు. ఆదివాసీల అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరపై సుమారు పది నిమిషాలపాటు చర్చ జరిగింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





