– గణాంకాలు విడుదల చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: రాష్ట్రంలో ఇంధన సరఫరాకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం తాజా నివేదికను విడుదల చేసింది. 27వ తేదీ నాటి అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు డిమాండ్ కంటే అత్యధికంగా అందుబాటులో ఉన్నాయని స్పష్టమైంది. సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ అవసరమయ్యే ఇంధన పరిమాణం కంటే 26వ తేదీన జరిగిన సరఫరా దాదాపు రెండింతలు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇది రవాణా రంగం, సామాన్య వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. పెట్రోల్ వినియోగాన్ని పరిశీలిస్తే, రాష్ట్రంలో రోజువారీ సగటు సరఫరా 5,883 కిలో లీటర్లుగా ఉంటుంది. అయితే, మార్చి 26 నాటికి ఏకంగా 16,609 కిలో లీటర్ల పెట్రోల్ను సరఫరా చేశారు. అంటే సాధారణ డిమాండ్ కంటే 182 శాతం అధికంగా పెట్రోల్ అందుబాటులో ఉంది. అదేవిధంగా, రవాణా , వ్యవసాయ రంగాలకు అత్యంత కీలకమైన డీజిల్ సరఫరా కూడా ఆశాజనకంగా ఉంది. రోజువారీ సగటు అవసరం 7,348 కిలో లీటర్లు కాగా, ప్రభుత్వం ఏకంగా 19,580 కిలో లీటర్లను సరఫరా చేసింది. ఇది సాధారణ డిమాండ్ కంటే 167 శాతం ఎక్కువ. మొత్తంగా చూస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఇంధన అవసరాలు తీర్చడానికి అవసరమైన సగటు 13,231 కిలో లీటర్లు అయితే, ప్రస్తుతం సరఫరా అవుతున్న పరిమాణం 36,189 కిలో లీటర్లుగా నమోదైంది. ఈ గణాంకాలను బట్టి చూస్తే రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని, సరఫరా వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని, ఇంధనం కోసం కంగారుపడి బంకుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదని ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. ‘తెలంగాణ రైజింగ్‘ లక్ష్యంగా ఇంధన సరఫరాలో ఎక్కడా అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





