– మగ్దుం భవన్లో డిప్యూటీ సీఎం భట్టి నివాళి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24: విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు విలువలకు కట్టుబడి జీవించిన మహనీయుడు సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy)కి లాల్ సలాం(Lal Salam) అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. మగ్దుం భవన్లో సుధాకర్రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శోకతప్త హృదయంతో వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శిగా మూడుసార్లు పనిచేయడం అంటే ఎంతటి నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదల ఉంటేనో సాధ్యమని కొనియాడారు. సుధాకర్ రెడ్డి చిన్ననాటి నుంచే ప్రజల జీవనస్థితిగతుల్లో మార్పు రావాలని కాంక్షించారని, సీపీఐలో కీలక నేతగా ఉన్నప్పటికీ అధికారపక్ష నేతలతో సంప్రదింపులు జరిపి ప్రజల కోసం పనిచేసేవారని చెప్పారు. 2004లో విద్యుత్ పోరాటంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆయన పనిచేయడం మరువలేనిదన్నారు. ఆ పోరాటం అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో సురవరం సుధాకర్ రెడ్డి ఆలోచనలు ప్రతిఫలించాయని చెప్పారు. వారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ పరుష పదజాలం వాడలేదని, ఎవరినీ శత్రుభావంతో చూడలేదని పేర్కొన్నారు. వారిని తాను అత్యంత అభిమానం గల నాయకుడిగా చూస్తానన్నారు. వారికి గౌరవం ఇవ్వాలన్న ఆలోచనతోనే అంతిమ సంస్కారాలు అధికారికంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి, యావత్ కేబినెట్ నిర్ణయించిందని, సీఎం రేవంత్తోపాటు కేబినెట్ సహచరులు అందరూ మగ్దుమ్ భవన్కు వచ్చి ఘనంగా నివాళులు అర్పించారని చెప్పారు. సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భట్టి హామీ ఇచ్చారు.—————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్సైట్ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





