– ప్రేమ వివాహం కేసులో పోలీసులకు టీజీహెచ్ఆర్సీ ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: యువతి స్వచ్ఛంద సమ్మతి లేకుండా గర్భస్రావం చేయడం చట్టపరంగా తీవ్రమైన నేరమని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) పేర్కొంది. దీనికి సంబంధించి మహేష్ అనే వ్యక్తి ఫిర్యాదును జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన కమిషన్ గురువారం పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. మహేష్ అనే యువకుడు యాదగిరిగుట్ట ఆలయంలో జనవరి 30న భాగ్య అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ వివాహాన్ని వ్యతిరేకిస్తున్న ఆమె తండ్రి, బావ కలిసి కల్వకుర్తి సమీపంలోని హాస్పిటల్లో ఆమె నాలుగు నెలల గర్భాన్ని బలవంతంగా తొలగించేందుకు ప్రయత్నించారని, ఈ తీవ్ర ఒత్తిడి కారణంగా ఆమె ఆత్మహత్యకు యత్నించిందని, పోలీసులు ఎ ఫ్ఐఆర్ నమోదు చేయలేదని పేర్కొన్న ఆరోపణలను కమిషన్ తీవ్రంగా పరిగణించింది. మహిళ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి చట్టప్రకారం అవసరమైన చర్యలు చేపట్టాలని కల్వకుర్తి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, వంగూరు ఎస్హెచ్వోలను ఆదేశించింది. నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో వ్యవహారాన్ని పర్యవేక్షించాలని పేర్కొంది. దీనిపై ఈనెల 26నాటికి సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





