మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్

– జలమండలి పరిధి విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
– మూడు కార్పొరేషన్లకు కమిషనర్ల నియామ‌కం
– 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులుగా జీహెచ్‌ఎంసీ విభజన

హైదరాబాద్, ఫిబ్రవరి 11: జలమండలి పరిధిని విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీతోపాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ)గా విభజించింది. ఈ క్రమంలోనే మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ కొనసాగుతుండగా సైబరాబాద్‌కు శ్రీజన, మల్కాజ్‌గిరికి వినయ్ కృష్ణారెడ్డిలను నియమించింది. కాగా, ఓఆర్ఆర్ పరిధిలో నీటి సరఫరా, సివరేజ్ నిర్వహణను జీహెచ్‌ఎంసీ నుంచి జలమండలికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నీటి సరఫరా, మురుగు వ్యవస్థలతోపాటు సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధిని కూడా జలమండలి చేపట్టనుంది. మల్కాజ్‌గిరి జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎస్.పంకజ, హైదరాబాద్ ఈడీగా సామ్రాట్ అశోక్, సైబరాబాద్ ఈడీగా ఎం.సంతోష్, లోక్ భవన్ జాయింట్ సెక్రటరీగా కె.శశి కిరణాచారిలను రాష్ట్ర సర్కార్ నియమించింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్‌లతో కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసింది. ఎల్‌బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి జోన్ ప్రాంతాలతో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయగా సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్‌లతో జీహెచ్‌ఎంసీని విభజించింది. ప్రస్తుతం 1450 చదరపు కిలోమీటర్ల మేర మంచినీటి సరఫరాతోపాటు 650 చ.కి.మీల మేర సివరేజ్ నిర్వహణ చేస్తున్న జలమండలి ఇకనుంచి 2,053 చ.కి.మీ మేర మంచినీటి సరఫరాతోపాటు సివరేజ్ నిర్వహణ చూడనుంది. కొత్తగా అవసరమైన ప్రాంతాల్లో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నిర్మించేందుకు జలమండలి చర్యలు తీసుకోనుంది. జీహెచ్‌ఎంసీని మొత్తం 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులుగా ప్రభుత్వం విభజించింది. శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్‌లను జోన్లుగా నిర్ణయించింది. ఆయా జోన్ల పరిధిలో సర్కిళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ జోన్ కింద ఆదిభట్ల, బడంగ్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్. చార్మినార్ జోన్ కింద సంతోష్ నగర్, యాకుత్‌పురా, మలక్‌పేట, చార్మినార్, మూసారాంబాగ్ వస్తాయి. ఖైరతాబాద్ జోన్ కింద ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్‌గూడ, అవిÖర్‌పేట, రాజేంద్రనగర్ జోన్ కింద రాజేంద్రనగర్, అత్తాపూర్, బహదూర్‌పుర, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, జంగమ్మెట్, గోల్కొండ జోన్ కింద గోషామహల్, కార్వాన్, గోల్కొండ, మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్. సికింద్రాబాద్ జోన్ కింద కవాడిగూడ, ముషీరాబాద్, అంబర్‌పేట్, తార్నాక, మెట్టుగూడ సర్కిళ్లు వస్తాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *