– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: బీజేపీగా ఆవిర్భవించి ఈరోజు దేశవ్యాప్తంగా అధికారంలోకి రావడం దీన్దయాళ్ వంటి మహనీయుల త్యాగ ఫలితమేనని, ఈ విజయానికి ఆయనకు పార్టీగా మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అన్నారు. దీన్దయాళ్ఉపాధ్యాయ అత్యంత సాధారణమైన, నిరాడంబరమైన జీవితం గడిపారన్నారు. నిరంతర అధ్యయనశీలి, కర్మయోగి, తత్వవేత్త, సిద్ధాంతకర్త అయిన ఆయన పుణ్యతిథి సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం రామచందర్ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ బలిదాన్ దివస్ సందర్భంగా ఆ మహనీయుడికి శ్రద్ధాంజలి ఘటించామన్నారు. భారతీయ జనసంఘ్ స్థాపకుల్లో ఒకరుగా, బీజేపీ సిద్ధాంతకర్తగా ఆయన చూపిన మార్గం దిక్సూచి వంటిదని కొనియాడారు. రాజకీయాలంటే ఆడంబరం, ప్రదర్శన కాదని, సేవ కోసం అనేది ఆయనను చూసి ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధికి భారతీయ సంస్కృతి, స్వదేశీ భావనలతో ముడిపడిన ఆర్థిక విధానం అవసరమని ఆయన స్పష్టం చేశారన్నారు. సమాజంలోని చిట్టచివరి వ్యక్తినీ అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు ఈరోజు ప్రధాని మోదీ నాయకత్వంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీదీన్దయాళ్ స్ఫూర్తితోనే అమలు అవుతున్నాయన్నారు. కాగా, ప్రస్తుతం రాజకీయాల్లో విద్వేషాలు, అసభ్య భాష, కుట్రలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




