– ఆమేరకు హామీ ఇచ్చింది
– అందుకే ట్రేడ్ డీల్ కు అంగీకరించాం
– అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహమ్ వెల్లడి
న్యూదిల్లీ, ఫిబ్రవరి 3: భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంపై అటు అమెరికా, ఇటు ఆసియా రాజకీయ, వాణిజ్య వ్యవహారాల పరిశీలకులు, ప్రజాప్రతినిధులు కీలకమైన విశ్లేషణలు చేశారు. రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై 500 శాతం సుంకాలను బాదాలనే వివాదాస్పద బిల్లును ప్రతిపాదించిన అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గిస్తామనే స్పష్టమైన హామీని భారత్ ఇవ్వబట్టే ట్రేడ్ డీల్కు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పచ్చజెండా ఊపారని అన్నారు. ఉక్రెయిన్పై ఎడతెరిపి లేని దాడులు చేస్తున్న రష్యాకు అతిపెద్ద ఆదాయ వనరుగా మారిన భారత్ లాంటి కస్టమర్ను దూరం చేయడంలో ట్రంప్ సఫలం అయ్యారన్నారు. మొత్తంమీద భారత్తో ట్రేడ్ డీల్, రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే విషయాల్లో ట్రంప్ ప్లాన్ సక్సెస్ అయిందని గ్రాహమ్ కొనియాడారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఆయన ఒక ట్వీట్ చేశారు. అమెరికా ప్రెసిడెంట్ భారీ సుంకాలను ప్రకటించినా భారత్ చాలా సంయమనంతో వ్యవహరించిందని కొనియాడారు. ఈ విషయంలో భారత్ను ఇతర దేశాలు అనుసరించొచ్చన్నారు. భారత్ తన ప్రవర్తనా విధానంతో సుంకాల తగ్గింపు కంటే ఎక్కువగా మంచిపేరును సంపాదించిందని గ్రాహమ్ కితాబిచ్చారు. రష్యా నుంచి చమురును కొంటున్న మిగతా పెద్ద దేశాలు రాబోయే రోజుల్లో భారత్ను అనుసరిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వాణిజ్యపరమైన ఒత్తిడి పెరిగితేనే ఉక్రెయిన్తో శాంతి చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రాధాన్యం ఇస్తారన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గిస్తామని ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయం అనేది ఆ దిశగా పడిన కీలక ముందడుగు లాంటిదన్నారు.
అమెరికాకు అత్యంత ఆప్తదేశం భారత్
‘భారత్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నందుకు ప్రెసిడెంట్ ట్రంప్నకు అభినందనలు. అమెరికాకు అత్యంత ఆప్తదేశం భారత్. దానితో వాణిజ్య అవరోధాలు తొలగినందుకు సంతోషంగా ఉంది. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో చైనాను ఎదుర్కొనేందుకు అమెరికాకు భారత్ సహాయం అవసరం. కొత్త డీల్లో భాగంగా అమెరికా చమురును భారత్ కొంటుంది. రష్యాతో చమురు అనుబంధాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని ఆపొచ్చు’ అని పేర్కొంటూ అమెరికా సెనెట్ విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ జిమ్ రిష్చ్ ట్వీట్ చేశారు. ‘ఇకపై భారత్కు మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులను అమెరికా రైతులు ఎగుమతి చేయొచ్చు. అతిపెద్ద భారత మార్కెట్ వల్ల గ్రామీణ అమెరికాకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. జనాభా పెరుగుతుండటం అనే అంశం భారత మార్కెట్ను మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది. కొత్తగా కుదిరిన ట్రేడ్ డీల్ అమెరికాకు ప్రయోజనకరం. ప్రత్యేకించి మా వ్యవసాయ రంగానికి కలిసొస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్తో ట్రేడ్ చేసి 1.3 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును అమెరికా ఎదుర్కొంది. ఇకపై ఈ లోటు తగ్గుతుంది’’ అని అమెరికా వ్యవసాయ శాఖ మంత్రి బ్రూక్ రోలిన్స్ పేర్కొన్నారు. ‘‘భారత్తో అమెరికా ట్రేడ్ డీల్ కుదరడం సంతోషకరం. ఇందుకోసం ప్రెసిడెంట్ ట్రంప్ను ‘డీల్ మేకర్ ఇన్ చీఫ్’ అని పిలవొచ్చు. చమురు డీల్స్ ద్వారా అమెరికాపై సిరుల వర్షాన్ని ట్రంప్ కురిపిస్తున్నారు. దేశానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. భారత్తో ఇంధన దౌత్యాన్ని నెరపడంలో ట్రంప్ సక్సెస్ అయ్యారు. అంతర్జాతీయ సంబంధాలు ఈ విధంగా బలోపేతం అయితేనే అమెరికా వికసిస్తుంది’ అని అమెరికా హోం, ఇంధన వ్యవహారాల శాఖల మంత్రి డౌగ్ బుర్గమ్ తెలిపారు. ’ట్రేడ్ డీల్పై అమెరికాతో చర్చలు జరిపే క్రమంలో భారత్ వ్యవహరించిన తీరు భేష్.. భారత్ చాలా ఓపికగా ఆచితూచి పావులు కదిపింది. ఏ తరుణంలోనూ అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగే అవకాశాన్ని ఇవ్వలేదు.. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు తమ మార్కెట్లోకి ఎంట్రీని ఇవ్వలేమని భారత్ తేల్చి చెప్పింది. కానీ వాణిజ్య లోటుకు తావు ఇవ్వని ట్రేడ్ డీల్ను మాత్రమే కుదుర్చుకుంటామని అమెరికా ప్రభుత్వం వాదించింది. దీంతో ఏటా దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా వ్యవసాయ, టెక్నాలజీ, ఇంధన ఉత్పత్తులను కొనేందుకు భారత్ అంగీకరించింది. వస్తు,సేవల ఎగుమతిపరంగా తనకు అత్యంత ముఖ్యమైన అమెరికా మార్కెట్ కోసం భారత్ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రతిగా భారత్పై విధించిన 25 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తామని అమెరికా ప్రకటించింది’ అని అమెరికా వాణిజ్య వ్యవహారాల అధ్యయన సంస్థ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్)కు చెందిన నిపుణులు రిచర్డ్ రోసో విశ్లేషించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



