– నిందితుల ఆస్తులు వేలం వేసి, బాధితులకు పరిహారం
– ‘సుప్రీమ్’ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక ఆదేశాలు
న్యూదిల్లీ, జనవరి 27: యాసిడ్ దాడుల కేసుల్లో బాధితులకు అండగా సుప్రీం కోర్టు నిలిచింది. వారికి అందచేస్తున్న పరిహారం సరిపోదని అభిప్రాయపడింది. నిందితుల ఆస్తులను వేలం వేసి బాధితులకు పరిహారంగా ఎందుకు ఇవ్వకూడదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. జీవితాంతం చికిత్స, పునరావాసం కోసం ప్రస్తుతం బాధితులకు అందజేస్తున్న పరిహారం కనీసం రూ.3 లక్షలు సరిపోదని పేర్కొంది. ఈ విషయంలో మెరుగైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ దారుణమైన నేరాలను నివారించేందుకు అసాధారణమైన శిక్షలు అవసరమని, ఈ దిశగా చట్టంలో మార్పులు చేయాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచన చేశారు. యాసిడ్ దాడి బాధితురాలు షాహీన్ మాలిక్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారించింది. బలవంతంగా యాసిడ్ తాగించిన ఘటనల్లో బాధితులకు తగిన పరిహారం, వైద్య సంరక్షణ సహా ఇతర ఉపశమనాలు లభించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తనపై జరిగిన యాసిడ్ దాడి కేసులో ఇప్పటికే 16 ఏళ్లు పోరాడానని, కానీ.. ట్రయల్ కోర్టులో నిందితులందరూ నిర్దోషులుగా విడుదలయ్యారని ఆమె ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో పోరాడుతూ తన జీవితంలో విలువైన కాలాన్ని కోల్పోయానని చెప్పారు. అయితే.. బాధితురాలి తరఫున హైకోర్టులో మంచి న్యాయవాది ఈ కేసును వాదించేలా సర్వోన్నత న్యాయస్థానం చర్యలు తీసుకుంటుందని సీజేఐ హా ఇచ్చారు. ఏడాది వారీగా యాసిడ్ దాడుల కేసులు, కోర్టుల్లో వాటి ప్రస్తుత స్థితి, బాధితుల కోసం చేపట్టిన పునరావాస కార్యక్రమాల వంటి వివరాలను అందజేయాలని అన్ని రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు ఆదేశించింది. బాధితులతో బలవంతంగా యాసిడ్ తాగించిన కేసుల వివరాలను కూడా అందించాలని చెప్పింది. బాధితుల విద్యార్హత, ఉద్యోగం, వైవాహిక స్థితి, వైద్య చికిత్స, దానికి అయిన లేదా అయ్యే ఖర్చుల వివరాలను కూడా సమర్పించాలని తెలిపింది. నాలుగు వారాల్లోగా వివరాలను అందజేయాలని ఆదేశించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



