- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- వలిగొండలో రూ. 50 కోట్లతో నిర్మించిన డబుల్ రోడ్డు ప్రారంభం
- కాంగ్రెస్ 140వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే
- సర్పంచులు, వార్డు మెంబర్లకు ఘన సన్మానం
వలిగొండ ప్రజాతంత్ర డిసెంబర్ 28: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మంత్రి పాల్గొని అనంతరం రేణుక ఎల్లమ్మతల్లి దేవాలయం నుంచి రాజీవ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేశారు. భువనగిరి (Bhuvanagiri) వలిగొండ మండలాలకు చెందిన సర్పంచులకు, ఉపసర్పంచ్ లకు, వార్డు మెంబర్లకు మంత్రితో పాటు ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. వలిగొండ నుంచి కాటిపల్లి వరకు రూ.50 కోట్లతో నూతనంగా నిర్మించిన బీటీ డబల్ రోడ్డును ఆదివారం మంత్రి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని సంగెం గ్రామం వద్ద బీమాలింగం బ్రిడ్జికి 50 కోట్లకు టెండర్ పూర్తయిందని వలిగొండ నుంచి వేలువర్తి మీదుగా ముత్తిరెడ్డిగూడెం వరకు బీటీ డబల్ రోడ్డుకు యాభై కోట్లకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. భువనగిరి నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో రహదారులు పటిష్టం చేస్తామన్నారు. రైతు సంక్షేమంలో భాగంగా రుణమాఫీ రైతు భరోసా పంటకు మద్దతు ధర కల్పించామని చెప్పారు. కాలేశ్వరం అవినీతి రాష్ట్రములో సంక్షేమ పథకాల అమలు గురించి కేసీఆర్కు ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేశామన్నారు, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు,ఐదు వందల రూపాయల కి గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పరిమితి రూ పది లక్షల వరకు పెంచామని తెలిపారు. అంతకుముందు మండలంలోని సుంకిశాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు, భువనగిరి వలిగొండ నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లు,జిల్లా నాయకులు,వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ కాంగ్రెస్ నాయకులు,మైనార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




