– బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: ప్రజాస్వామ్యాన్ని కాపాడి దాన్ని ముందుకు నడిపించిన విషయంలో మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన నాయకుడు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అన్నారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాజ్పేయి శత జయంతి సందర్భంగా హైదరాబాద్లోని నారాయణగూడలో ‘అటల్ జీ స్మృతి సమ్మేళనం’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి జీవితం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, నాయకత్వం, విలువలుపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. ముఖ్య అతిథిగా రామచందర్రావు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఆదాయం-ఖర్చు మధ్య సమతుల్యత పాటించాలని, సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సమానంగా అమలు చేయాలని చెప్పారు. ఈ సమతుల్యతను సాధించిన నాయకుడు వాజ్పేయి అని గుర్తు చేశారు. అందుకే ఆయన జయంతిని ‘గుడ్ గవర్నెన్స్ డే’గా దేశం మొత్తం జరుపుకుంటోందన్నారు. ఈరోజు రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలతో విధానపరమైన విమర్శలు, సైద్ధాంతిక చర్చలను కొంతమంది మరిచిపోయారు.. వాదనలతో మాట్లాడితే కూడా బూతుల వంటి వ్యాఖ్యలు వింటున్నాం.. అందుకే నిజమైన, అర్థవంతమైన చర్చలతో ప్రజాస్వామ్య విలువలను గౌరవించడం తప్పనిసరి అని ఆయన సూచించారు. పార్టీ సిద్ధాంతాలను విమర్శించవచ్చు.. విధానాలను ప్రశ్నించవచ్చు.. కానీ వ్యక్తిగత విమర్శలు చేయకూడదన్నారు. వాజ్పేయి స్ఫూర్తి మనకు ఇదే నేర్పిస్తుందని చెప్పారు. ఆయన ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా వ్యక్తిగత దాడులకు పాల్పడకుండా విధానాలపై మాత్రమే చర్చించేవారని గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇలాంటి కొత్త పరంపరను కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు రెండూ విధానపరమైన విమర్శలను స్వీకరించి వ్యక్తిగత దాడులను నివారించాలని హితవు పలికారు. కార్యక్రమంలో ప్రధాన అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు, బీజేపీి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, తదితరులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




