– బాలుడిని హత్య చేసిన సవతి తండ్రి
– చాంద్రాయణగుట్టలో ఘటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్టలో దారుణం చోటుచేసుకుంది. పక్కింటి పిల్లలతో తరచూ గొడవ పడుతున్నాడనే కోపంతో పదేళ్ల బాలుడిని అతని సవతి తండ్రి కిరాతకంగా హత్య చేశాడు. బాలుడి తలను రోడ్డుకేసి బాదడంతో తీవ్రంగా గాయపడగా, హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. చాంద్రాయణగుట్టకు చెందిన ఓ మహిళకు గతంలో వివాహమైంది. భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఆమె మొదటి భర్త కుమారుడైన షేక్ మహ్మద్ అజహర్ (10) కూడా వారితోనే ఉంటున్నాడు. అయితే అజహర్ తరచూ ఇరుగుపొరుగు పిల్లలతో గొడవ పడేవాడు. ఈ విషయమై స్థానికులు బాలుడి సవతి తండ్రిని నిలదీసేవారు. ఈ క్రమంలోనే ఈ నెల 7న తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు.. బాలుడి తలను పట్టుకుని రోడ్డుకేసి బలంగా కొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన అజహర్ను కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన సవతి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
.తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




