– ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు
– పాస్లు ఉన్నవారే రావాలన్న కమిషనర్
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్12:ఉప్పల్ స్టేడియంలో శనివారం జరగబోయే అంతర్జాతీయ ఫుట్బాల్ ఈవెంట్ కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. ఈవెంట్కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మెస్సీకి జి కేటగిరీ భద్రత కల్పిస్తున్నామని, ఆయన్ని గ్రీన్ ఛానల్ ద్వారా స్టేడియంకు తీసుకువస్తామని సీపీ తెలిపారు. అయితే, వాహనంలో ఉన్నప్పుడు కూడా మెస్సీని చూసే అవకాశం ప్రేక్షకులకు ఉండదని, కాబట్టి అనవసరంగా రోడ్డుపైకి వొచ్చి చూసే ప్రయత్నం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. స్టేడియం సామర్థ్యం 39 వేలు అని, దానికి తగ్గట్టుగానే నిర్వాహకులు పాస్లు అమ్ముతున్నారని, అయితే స్టేడియం దగ్గర ఎలాంటి పాస్లు అమ్మబడవని, కేవలం ఆన్లైన్ లోనే పాస్లు అమ్మబడతాయని క్లారిటీ ఇచ్చారు. పాసులు ఉన్నవారు మాత్రమే రావాలని, లేనివారు స్టేడియం వద్దకు రావద్దని స్పష్టం చేశారు సీపీ. భద్రత కోసం స్టేడియం పరిసరాల్లో 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. అంతేకాకుండా, మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్లతో కూడా నిఘా పెడుతున్నట్లు చెప్పారు. రేపు సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుందని, సాయంత్రం 4 గంటల నుంచే ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తామని సీపీ పేర్కొన్నారు. మెస్సీ కొద్దిసేపు మాత్రమే ఆడతారు కాబట్టి, ప్రేక్షకులు ముందస్తుగానే స్టేడియం చేరుకోవాలని సూచించారు. భద్రతా కారణాల దృష్ట్యా, ల్యాప్ టాప్లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, గొడుగులు, లైటర్లు, బైనాకులర్లు, బ్యాటరీలు, షార్ప్ ఆబ్జెక్టస్, హెల్మెట్, బ్యాగ్ వంటి వస్తువులకు స్టేడియం లోపలికి అనుమతి లేదని, కేవలం మొబైల్ ఫోన్లను మాత్రమే అనుమతిస్తున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు..
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.