– వాహనాల ఫిట్నెస్, చలానాలపై తనిఖీలు
– ప్రయాణికుల ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లను వేధించొద్దు
– రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు
– రవాణా శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12: రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకొనేందుకు రవాణా శాఖలో నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ ఉండేలా ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను రూపొందించింది. ఎన్ఫోర్స్మెంట్ కఠినతరం చేయడానికి సచివాలయంలో రవాణా శాఖ ముఖ్య అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాస్థాయిలో 33 బృందాలు, రాష్ట్రస్థాయిలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ప్రతి రోజూ విధిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టేలా ఆ రోజు చేయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతాలపై ఆయా బృందాలకు ఉదయం ఆరు గంటలకు రవాణా శాఖ ఉన్నతాధికారుల నుండి సమాచారం అందజేస్తారు. ముఖ్యంగా ఓవర్ లోడింగ్ లారీలు, బస్సులు మినరల్ ట్రాన్స్పోర్ట్ లో సాండ్ ,ఫ్లైయాష్ , స్టోన్, బిల్డింగ్ మెటీరియల్స్ ,వాహనాల ఫిట్నెస్ , పొల్యూషన్ , చలానాలు పై ఈ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలు చేయనున్నాయి. వాటికి అదనపు పెనాల్టీ తో పాటు వాహనాల సీజ్ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఒక్కో బృందంలో డిటిసి ఎంవీఐ , ఏఎంవీఐ ఇతర సిబ్బంది ఉండనున్నారు. గత నెలల్లో రద్దు చెస్ పోస్ట్ లో పని చేసిన సిబ్బందిని కూడా ఎన్ఫోర్స్మెంట్ లో చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు , వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్ లపై వేధింపులకు గురి చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. జెటిసి (ఎన్ఫోర్స్మెంట్) రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ను ఏర్పాటు చేయడానికి జిల్లాల నుండి ఎంవీఐ/ఎఎంవీఐలను నెలవారీ రొటేషన్ పద్ధతిన రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీ చేయడానికి ఈ స్క్వాడ్ను ఉపయోగిస్తారు. జెటిసి-హైదరాబాద్, డిటిసిలు ప్రభుత్వ సెలవు దినాలతో సహా అన్ని సమయాల్లో కనీసం ఒక ఎన్ఫోర్స్మెంట్ బృందం రోడ్డుపై ఉండే విధంగా ఎన్ఫోర్స్మెంట్ బృందాలను మోహరించేలా చూసుకోవాలి. హైదరాబాద్లోని జెటిసి ,రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్ , సంగారెడ్డి డీటీసీలు ప్రతి వారం కనీసం రెండుసార్లు అంతర్-రాష్ట్ర కాంట్రాక్ట్ క్యారేజ్ (సీసీ) బస్సులపై తనిఖీలు నిర్వహించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలి.ఫిట్నెస్ గడువు ముగిసిన వాహనాలు, ముఖ్యంగా భారీ వస్తువుల వాహనాలు, బస్సులు ఎల్లప్పుడూ సీజ్ చేయబడతాయి.ఓవర్ స్పీడ్ వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఓవర్లోడ్ గూడ్స్ వాహనాలను పూర్తిగా సీజ్ చేయాలి.ముఖ్యంగా సీసీ బస్సులు, బహుళ ఈ-చలాన్లు/విసిఆర్లు ఉన్న భారీ వస్తువుల వాహనాలను స్వాధీనం చేసుకుంటారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా తిరిగే వాహనాలు, ముఖ్యంగా భారీ, మధ్య తరహా వస్తువుల వాహనాలు ప్రయాణికుల వాహనాలు విద్యా సంస్థ బస్సులు సీజ్ చేయబడతాయి. వస్తువుల వాహనాలలో ఓవర్లోడింగ్ వాహనాలను స్వాధీనం చేసుకోవాలి .అదనపు లోడ్ను ఆఫ్లోడ్ చేయకుండా అనుమతించకూడదు. సంబంధిత అధికారులు ప్రారంభ పాయింట్ల వద్దనే ఓవర్లోడింగ్ ముప్పును అరికట్టడానికి అమలు ప్రణాళిక వేయాలి. మైనింగ్ విభాగానికి ఓవర్లోడ్ వాహనాల వివరాలను కూడా తెలియజేస్తుంది. టిప్పర్ లు ,ఓపెన్ ట్రాలీ వాహనాలు వస్తువులు వాహనాలు దుమ్ము దులిపకుండా టార్పాలిన్తో సరిగ్గా కప్పబడని వాహనాలపై చర్యలు సీసీ బస్సులలో సీట్ల మార్పు, అత్యవసర నిష్క్రమణను నిరోధించడం వంటి అనధికార మార్పులు చేస్తే చర్యలు తీసుకోవాలి.ఫిట్నెస్ గడువు ముగిసిన ఈఐబీల జాబితాను సేకరించి, రోడ్లపై తిరుగుతున్నట్లు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకోవాలి. గత వారం చేవెళ్ల బస్సు ప్రమాదం అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల పై తీసుకున్న చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. వారం రోజుల వ్యవధిలో 2576 వాహనాల పై కేసులు నమోదు చేశారు. ఇందులో ఓవర్ లోడ్ తో వెళ్తున్న 352 లారీలు , 43 బస్సుల పై కేసులు నమోదు చేశారు. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ లు వేగవంతం అయ్యేలా చూడాలని ఆదేశించారు. రవాణా శాఖ సిబ్బందికి ప్రతి 30 మందికి ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ ఇవ్వాలన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి మహిళా ఆటో అనుమతులు ఇచ్చేలా కార్యాచరణ తీసుకోవాలి. వచ్చే రోడ్ సేఫ్టీ మంత్ పై ప్రజల్లో విసృత అవగాహన కల్పించాలనీ ఆదేశించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఇన్నోవేటివ్ కార్యక్రమాలు రూపొందించాలని పేర్కొన్నారు. చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పై అవగాహన కల్పించాలని సూచించారు.సమీక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి , జెటిసి లు రమేష్ , చంద్రశేఖర్ , శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





