భక్తులకు మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

– పరిమిత సంఖ్యలో ప్రొటోకాల్‌ దర్శనాలు
– అధికారులకు యాదాద్రి ఆలయ ఈవో ఆదేశాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: ఇకపై పరిమిత సంఖ్యలోనే ప్రొటోకాల్‌ దర్శనాలు కల్పించాలని, సామాన్య భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యమిచ్చేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ఆలయంలోని వివిధ విభాగాల్లో ఆయన సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ముందుగా ప్రొటోకాల్‌ విభాగంలో భక్తులకు సౌకర్యాలు అందించే విధివిధానాలను పరిశీలించారు అలాగే ప్రతి మంగళవారం, శనివారం స్థానిక భక్తుల కోసం ఉచిత దర్శన పథకం కింద మరింత సౌకర్యం కల్పించందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. శివాలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించారు. ప్రతీ సోమవారం శివాలయంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రసాదం తయారీ విభాగాన్ని పరిశీలించి ఉపయోగిస్తున్న పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, ప్రసాదాల ప్యాకేజీ విధానాన్ని పరిశీలించారు. భక్తులకు అందించే ప్రసాదం రుచికరంగా, నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలిచ్చారు. అనంతరం టికెట్‌ కౌంటర్లు, అక్కడి సిబ్బంది పనితీరును పరిశీలించి భక్తులతో మమేకమయ్యారు. భక్తుల అభిప్రాయాలను విని టికెట్‌ జారీ విధానంలో వేగం పెంచాలని సూచించారు. కియోస్క్‌ల పనితీరును కూడా పరిశీలించారు. పాత గుట్ట ఆలయాన్ని సందర్శించి అక్కడి నిర్మాణాలు, భక్తుల సౌకర్యాలు పరిశీలించారు. పాత గుట్ట ఆలయంలో అద్దాల మండపం నిర్మాణం, ఆంజనేయ స్వామి ఆలయం పునరుద్ధరణ పనులను వెంకట్రావు పరిశీలించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *