– ఏటీసీలలో చదివిన వారికి ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ ఇవ్వాలి
` స్కాలర్షిప్ కోసం ఆర్థిక మంత్రిని ఒప్పించండి
– నైపుణ్యం ఉంటే అవకాశాలు మీవద్దకే
– 65 ఏటీసీలను వర్చువల్గా ప్రారంభించిన సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: తెలంగాణ పునర్నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. 20247 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలన్నారు. మల్లెపల్లి ఐటీఐ ప్రాంగణంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా 65 ఏటీసీలను వర్చువల్గా సీఎం శుక్రవారం ప్రపారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట 1956లో ఐటీఐలను ప్రారంభించారని, మారుతున్న కాలానికనుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదని ఆదేదన వ్యక్తం చేశారు. కోర్సులను అప్గ్రేడ్ చేయకపోవడంతో కాలక్రమేణా ఐటీఐలు నిర్వీర్యమయ్యాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఐటీఐలను పునరుద్ధరించాలని ఆలోచించి వాటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్(ఏటీసీ)లుగా అప్ గ్రేడ్ చేశామని చెప్పారు. సంకల్పం ఉంటే సాధ్యం కానిది, సాధించలేనిది ఏదీ లేదన్నారు. తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇవాళ ప్రారంభించుకున్న 65 ఏటీసీలే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 65 ఎటీసీలను పూర్తి చేశాం, ఇవాళ మరో 51 ఏటీసీలను మంజూరు చేశామని, ఏడాదిలోగా వాటి నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. నైపుణ్యం లేకపోతే సర్టిఫికెట్లు ఎందుకూ ఉపయోగపడవని, యువతకు నైపుణ్యం అందించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని, యువతకు నైపుణ్యత అందించాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. సాంకేతిక నైపుణ్యంపై ఫోకస్ పెట్టండి.. జర్మనీ, జపాన్లు కూడా మన ముందు మోకరిల్లే రోజు వస్తుంది అని యువతకు ఆయన ఉద్బోధించారు. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. మీ తలరాతలు మారడం మీ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని ఉపయోగించుకోండి.. సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోండి.. వ్యసనాలకు బానిస కాకకండి.. తల్లిదండ్రులకు బాధను మిగల్చకండి అని విద్యార్థులకు సీఎం హితబోధ చేశారు.
ఆర్టీసీలో అప్రెంటిస్షిప్, సైఫండ్ కోసం ్రపయత్నించండి
ఏటీసీలలో చదువుకున్న వారికి ఆర్టీసీలో అప్రెంటిస్ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్కు, ప్రతీ నెలా రూ.2 వేలు స్కాలర్షిప్ అందించేలా ఆర్ధిక మంత్రిని ఒప్పించి ఇప్పించాలని మంత్రి శ్రీధర్బాబుకు సీఎం సూచించారు.మీ సోదరుడిగా మీ భవిష్యత్ కోసం మేం ప్రణాళికలు వేస్తున్నాం. మన యువతకు జపనీస్ నేర్పితే అక్కడ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జపాన్ సిద్ధంగా ఉందన్నారు. మనిషికి తెలివి, పని చేసే కమిట్మెంట్ ఉంటే చాలు ఉన్నత స్థానానికి చేరుకోవచ్చునన్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని, మీ భవిష్యత్తుకు పునాదులు వేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.
స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్గా తెలంగాణ :మంత్రి శ్రీధర్బాబు
పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య స్కిల్స్ విషయంలో ఏర్పడిన అంతరాన్ని పూడ్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. తెలంగాణ యువత అత్యంత ప్రతిభావంతులని, ఇదే మనకున్న పెద్ద ఆస్తి అని చెప్పారు. మల్లెపల్లి ఐటీఐ ప్రాంగణంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ప్రారంభోత్సవంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడారు. యువతకు పరిశ్రమల అవసరాలకనుగుణంగా స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అందుకు తగ్గట్లుగా అకడమిక్ కరిక్యులంలోనూ మార్పులు, చేర్పులు చేస్తున్నామన్నారు. .నైపుణ్యం గల తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే బాధ్యత తమ ‘రౖౖెజింగ్ తెలంగాణ 2047’ లక్ష్య సాధనలో యువత పాత్ర కీలకమన్నారు. ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం యువతను నిర్లక్ష్యం చేసిందని, ఆ తప్పులను మేం ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నామని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశామని, 60 వేలకు పైగా ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేశామని శ్రీధర్బాబు వివరించారు.





