మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్‌ ‌ఫాల్కే అవార్డు

– ఎక్స్ ‌వేదికగా ప్రకటించిన కేంద్ర సమాచార శాఖ
– బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రశంసలు
– 23నజరిగే కార్యక్రమంలో అవార్డు బహూకరణ
– అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 20:‌ మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ను అత్యంత ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ‌ఫాల్కే అవార్డు వరించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. శనివారం కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ ‌వేదికగా పోస్ట్ ‌పెట్టింది. 2023 సంవత్సరానికి గానూ మోహన్‌లాల్‌ ‌దాదా సాహెబ్‌ ‌ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా భారతీయ చలన చిత్రరంగానికి ఆదర్శవంతమైన సేవలను అందించారని పేర్కొంది. మోహన్‌లాల్‌ అద్భుత ప్రతిభ, వైవిధ్యం, కృషి, పట్టుదల భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని కొనిడియాడింది. ఈనెల  23న జరిగే 71వ నేషనల్‌ ‌ఫిల్మ్ అవార్డస్ ‌ప్రదానోత్సవంలో మోహన్‌లాల్‌ ఈ అవార్డును అందుకోనున్నారు. సినిమా నరంగంలో దాదాసాహెబ్‌ అవార్డు అత్యుత్తమైనదిగా గుర్తిస్తారు. మోహన్‌లాల్‌ ఇప్పటివరకూ మొత్తం 6 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ నటుడిగా రెండు, స్పెషల్‌ ‌జ్యూరీ అవార్డులు విభాగాల్లో నాలుగు విభాగాల్లో అవార్డు కైవసం కాగా, నిర్మాతగా ‘వానప్రస్థానం’ చిత్రానికి మరో అవార్డు వొచ్చింది. కేరళ రాష్ట్ర అవార్డులు, ఫిలిం ఫేర్‌ అవార్డులు ఆయన కొత్తే కాదు. సినిమాకు చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌ అవార్డులతో సత్కరించింది. ఇప్పుడు దాదా సాహెబ్‌ ‌ఫాల్కే అవార్డుతో ఆయన గౌరవాన్ని మరింత పెంచింది.మలయాళం సహా 5 భాషల సినిమాల్లో మోహన్‌లాల్‌ ‌నటించి మెప్పించారు.  భారతీయ సినీ పరిశ్రమకు మోహన్‌ ‌లాల్‌ ‌చేసిన సేవలు, ఆయన సినీ ప్రస్థానం ఆదర్శనీయం అని.. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ ‘దాదా సాహెబ్‌ ‌ఫాల్కే’ అవార్డు ప్రకటించినట్లు భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. మోహన్‌ ‌లాల్‌ ‌ప్రస్తుతం హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘వృషభ’. హిస్టారికల్‌ ‌యాక్షన్‌ ‌డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్‌ ‌నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. నంద కిషోర్‌ ‌దర్శకత్వంలో కనెక్ట్ ‌డియా, బాలాజీ టెలిఫిలిమ్స్‌తో కలిసి అభిషేక్‌ ‌వ్యాస్‌ ‌స్టూడియోస్‌ ఈ ‌చిత్రాన్ని   నిర్మిస్తోంది. ఈ మూవీ టీజర్‌ ఇప్పటికే విడుదలైంది. ’యుద్ధాలు, భావోద్వేగాలు, గర్జన’.. ఈ సినిమా కథ ఇదే. మైథాలజీతో పాటు- యాక్షన్‌, ‌డ్రామా,  సస్పెన్స్ ఇలా అన్నికమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో  తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మోహన్‌ ‌లాల్‌ ‌నట విశ్వరూపాన్ని చూస్తారని మేకర్స్ ‌చెప్పారు. తెలుగు, మలయాళం  భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది.  హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమా రిలీజ్‌ ‌కానుంది. తెలుగులో ఆయన నటించిన జనతా గ్యారేజ్‌ ‌మంచి పేరు సంపాదించింది. మోహన్‌లాల్‌ ‌దాదా సాహెబ్‌ ‌ఫాల్కే అవార్డుకు ఎంపికైన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ మోహన్‌లాల్‌ ‌నట వైవిధ్యాన్ని ప్రధాని ప్రశంసించారు. మలయాళ సినిమాకు దివిటీలా నిలిచారని కొనియాడారు. కేవలం మలయాళమే కాకుండా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ అద్భుతమైన పాత్రలు పోషించారని, ఎంతో స్ఫూర్తిని నింపారని అన్నారు. మరో మలయాళ స్టార్‌ ‌మమ్ముటి కూడా మోహన్‌లాల్‌కు అభినందనలు తెలిపారు. తనకు మోహన్‌లాల్‌ ‌సోదరుడివంటివారని, ఆయన అద్భుత సినీ ప్రయాణినికి ఈ అవార్డు తగిన గుర్తింపు అని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *