పాత ఆరోపణలే..
హైదరాబాద్ చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు
“నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది..అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. లండన్ పర్యటన అనంతరం శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు మీడియా తో మాట్లాడుతూ..గత కొంతకాలంగా మా పార్టీపైన, నాపైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను..కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాలుగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసిందే..అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు ఎరువులు దొరకక రైతులు గోస పడుతుంటే, మరోవైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొంటూ కేసీఆర్ కాలంలో ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక్కొక్కటిగా కూల్చే ప్రయత్నం చేస్తోంది..ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడం మా కర్తవ్యం. ద్రోహుల చేతుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంపైనే మా దృష్టి అంతా ఉంటుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకొని, ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం అని ధీమా వ్యక్తం చేసారు.





