– సిద్ధిపేటలో బిఆర్ఎస్ శ్రేణుల నిరసన
– ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: తెలంగాణ సాధకులు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, హరీష్రావు చరిత్రను చెరిపేస్తే చెదిరేది కాదనీ, తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్, హరీష్రావు చరిత్రలో నిలుస్తారనీ, అధికార మదంతో ముఖ్యమంత్రి ఎనుములు రేవంత్రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయాలకు ఎవరూ భయపడరనీ బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, సిద్ధిపేట నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, హరీష్రావు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసిస్తూ సోమవారం సిద్ధిపేట-రంగధాంపల్లి(రాజీవ్ రహదారి)చౌరస్తాలో గల అమరవీరుల స్థూపం వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తొలుత రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి తీసువొచ్చిన గోదావరి జలాలతో బిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపానికి అభిషేకం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, నియోజకవర్గ నాయకులు మాట్లాడారు. కేసీఆర్, హరీష్రావులది నూటికి నూరు శాతం తెలంగాణ రక్తం అని, తెలంగాణ సమాజం రక్షణ, ర్రాట ప్రయోజనాల ఆ ఇద్దరు నేతలు తపిస్తారన్నారు. వారికి స్వార్ధం ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రమే వొచ్చేది కాదనీ, తెలంగాణ అభివృద్ధిలో దేశంలో ఆదర్శంగా నిలిచేది కూడా కాదన్నారు. రేవంత్రెడ్డి చేసిన నింద ఎక్కడ కూడా నిలిచేది కాదనీ, యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్, హరీష్రావు వైపు ఉందన్నారు. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు అని, అలాంటి కాళేశ్వరం పై బురదజల్లుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకు కనువిప్పు కలగాలన్నారు. కాంగ్రెస్ పాలనను చూసి, రాష్ట్రం సాధించిన కేసీఆర్, హరీష్రావు, కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న కుట్రలు చూసి అమరుల ఆత్మ ఘోషిస్తుందన్నారు. తెలంగాణ తెచ్చినోళ్ల పైనే నిందలు వేస్తారా అని మండిపడ్డారు. తెలంగాణ సమాజం మరోసారి సకల జనులు మేలుకొనే సమయం అసన్నమైందనీ, అందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, హరీష్రావు జరుగుతున్న కుట్ర తెలంగాణ సమాజంపై జరుగుతున్నట్లేనని బిఆర్ఎస్ నేతలు అన్నారు. కేసీఆర్ ఏ పాపం చేశాడని సిబిఐ విచారణ చేస్తారని ప్రశ్నించారు. సమైక్య పాలనలో తెలంగాణ పదం పలకడానికి భయపడ్డనాడు.. జై తెలంగాణ అని నినదించి తెలంగాణ సాధించిన కేసీఆర్పైనే నిందలు వేస్తారా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పదం పలికినందుకు నిందలా?అని అడిగారు. కాళేశ్వరం ఎవరైతే కూలేశ్వరం అన్నారో వాళ్లే ఈరోజు తెలంగాణ పాలిట శనీశ్వరులయ్యారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. చెప్పులు లైన్లో పెట్టకుండా ఎరువుల కోసం లైన్లో నిలుచోకుండా పదేండ్లు ఎరువులు అందించినందుకు కేసులు పెడతారా? ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రైతుబంధు, రైత బీమా తెచ్చి అన్నదాతను అప్పుల వారి నుంచి బయటకు తెచ్చినందుకు కేసులు పెడతారా? కొనుగోలు కేంద్రాలను పెంచి చివరి గింజదాకా ధాన్యం కొన్నందుకు కేసులు పెడతారా? ప్రాజెక్టులు కట్టినందుకా? రుణమాఫీ చేసినందుకా? ఊరు ఊరు రైతు వేదికలు కట్టినందుకా? కొరోనా విపత్తు నుండి ప్రజలను బయటకు తెచ్చినందుకా? ఎందుకు కేసు పెడతారని బిఆర్ఎస్ పార్టీ నాయకుడు శర్మ ప్రశ్నించారు. కేసులు పెట్టాల్సి వొస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపైన పెట్టాలన్నారు. తెలంగాణను అన్ని విధాలుగా కేసీఆర్ అభివృద్ధి చేస్తే …ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్రెడ్డి తెలంగాణను సర్వ నాశనం చేస్తున్నందుకు రేవంత్రెడ్డిపైనే కేసు పెట్టాలన్నారు. కేసీఆర్, హరీష్రావు ప్రతిష్టను దెబ్బతీసేందుకు సిఎం రేవంత్రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్ రిపోర్టు కోర్టులో నిలబడదనీ, రాష్ట్రానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న నష్టం, చేస్తున్న ద్రోహం చరిత్రలో నిలిచిపోతుందనీ, చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. రోడ్డుపై కూర్చోని నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్ రహదారిపై బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తల బైఠాయింపు హైవే కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కార్యక్రమంలో నాయకులు మచ్చ వేణుగోపాల్రెడ్డి, కొండం సంపత్రెడ్డి, పాల సాయిరాం, కాముని శ్రీనివాస్, వంగ తిరుమల్రెడ్డి, కుంభాల ఎల్లారెడ్డి, నిమ్మ రజనీకాంత్రెడ్డి, జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, బెల్లంకొండ వెంకట్తో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





