– రెండు రోజుల స్పీకర్ల సమావేశంలో హోం మంత్రి అమిత్ షా
న్యూదిల్లీ, ఆగస్టు 24: దేశ స్వేచ్ఛ లాగే దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Home Minister Amit sha) అన్నారు. సభ గౌరవాన్ని, స్పీకర్ పదవి గౌరవాన్ని పెంచే దిశగా పనిచేయాల్సిన అవసరాన్ని కూడా నొక్కిచెప్పారు. దేశ రాజధానిలోని దిల్లీ అసెంబ్లీలో రెండు రోజులపాటు జరిగే అఖిల భారత స్పీకర్ల సమావేశాన్ని(All India Sperakers’ conference) అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. కేంద్ర శాసనసభకు మొదటి భారతీయ స్పీకర్గా విఠల్భాయ్ పటేల్ ఎన్నికై వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమిత్షా మాట్లాడుతూ భారతీయ ఆలోచనల ఆధారంగా దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడానికి పునాది వేయడానికి విఠల్భాయ్ పటేల్ పనిచేశారని కొనియాడారు. మన దేశ ప్రజల సమస్యలను లేవనెత్తడానికి నిష్పాక్షిక వేదికను అందించడానికి మనం పరితపించాలన్నారు. సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాలు నిష్పాక్షిక వాదన చేయాలని, సభ పనితీరు.. సంబంధిత సభ నియమాల ప్రకారం జరిగేలా చూసుకోవాలని సభ్యులకు సూచించారు. మన దేశ సుధీర్ఘ చరిత్రలో అసెంబ్లీలు తమ గౌరవాన్ని కోల్పోయినప్పుడల్లా మనం భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది అని కేంద్ర మంత్రి అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఉత్తమ పద్ధతులను నేర్చుకోవడానికి రెండు రోజుల స్పీకర్ల సమావేశం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, పార్లమెంటు, అసెంబ్లీలు కేంద్ర బిందువులని, రెండూ సరిగ్గా పనిచేయకపోతే ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తుతాయని చెప్పారు. ఈ కార్యక్రమం రాష్ట్ర శాసనసభల స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లతోపాటు రాష్ట్ర శాసన మండళ్ల అధ్యక్షులు, డిప్యూటీ చైర్మన్లను ఒకచోట చేరుస్తుందని ఆకాశవాణి ప్రతినిధి పేర్కొన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో జరిగే చర్చలు, అధ్యక్షత వహించే అధికారులు అనుభవాలను పంచుకోవడానికి, ఉత్తమ పద్ధతులను మార్పిడి చేసుకోవడానికి, శాసనసభల పనితీరు కోసం కొత్త విధానాలను అన్వేషించడానికి అర్థవంతమైన వేదికను అందిస్తాయని భావిస్తున్నారు. ఏఐ ఆధారిత సాధనాలు వంటి డిజిటల్ ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించి, చట్టసభల రూపకల్పనలో పారదర్శకత, సామర్థ్యం, ప్రతిస్పందనను బలోపేతం చేయడం ఈ సమావేశం లక్ష్యం. విఠల్భాయ్ పటేల్, భారతదేశ పార్లమెంటరీ సంస్థల పరిణామంపై అరుదైన ఆర్కైవల్ రికార్డులు, ఛాయాచిత్రాలు, పత్రాల ప్రత్యేక ప్రదర్శనను హోంమంత్రి ప్రారంభించారు. ఆయన జీవితం ఆధారంగా ఒక స్మారక తపాలా బిళ్లను కూడా విడుదల చేశారు. ధిల్లీి లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా, దిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఢల్లీి ప్రభుత్వ మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్సైట్ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





