– శాసనమండలి చైర్మన్ గుత్తా నివాళులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6: తెలంగాణ జాతిపిత ప్రొపెసర్ జయశంకర్ (Jayashankar) జయంతి సందర్భంగా శాసన సభ ప్రాంగణంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Legislative council chairman Gutta Sukhender Reddy) నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధనే శ్వాసగా జీవించిన మహోన్నత వ్యక్తి ప్రొపెసర్ జయశంకర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేశారని వివరించారు. మన నీళ్లు మనకు, మన ఉద్యోగాలు మనకు అని గర్జించిన ధీశాలి ఆయన అని తెలిపారు. తెలంగాణ ఆవశ్యకతను యువతకు అర్ధం అయ్యేలా రచనలు చేసి, రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిగా నిలిచారని చెప్పారు. జయశంకర్ జీవితం నేటి యువతకు ఆదర్శమని సుఖేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం వారి సేవలను గుర్తించి వారి పేరును భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ యూనివర్సిటికీ పెట్టి గౌరవించుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డాక్టరు నరసింహాచార్యులు, శాసనసభ, శాసనమండలి ఉద్యోగులు, చైర్మన్ పేషీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





