– ఈవీఎంలపై అనుమానాలున్నాయి
– కాళేశ్వరం నివేదికను 60 పేజీలకు కుదించిన కాంగ్రెస్
– ఘోష్ నివేదిక మొత్తం ట్రాష్
– ఓటర్ు జాబితా సవరణలో అన్ని పార్టీలకు భాగస్వామ్యం
– ఈసీని కోరామన్న కెేటీఆర్
న్యూదిల్లీ, ఆగస్టు 5: ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలున్నందున తిరిగి పేపర్ బ్యాలెట్తోనే దేశంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ను బీఆర్ఎస్ పక్షాన కోరామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తాము వేసిన వారికి ఓటు వెళ్లడం లేదన్న అనుమానం ప్రజలకు వస్తే అది భారత ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఎన్నికల సంస్కరణలు, ప్రతిపాదనలు, ప్రవర్తనా నియమావళి సంబంధిత అంశాలపై చర్చించాలన్న భారత ఎన్నికల కమిషన్ ఆహ్వానం మేరకు వారితో సమావేశమయ్యామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ది చెందిన ఎన్నో దేశాలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేసి తిరిగి పేపర్ బ్యాలెట్తోనే ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతిని గుర్తుచేశామన్నారు. నవంబర్లో జరిగే బీహార్ ఎన్నికలతోనే పేపర్ బ్యాలెట్ను ప్రవేశపెట్టి తరువాత జరిగే సాధారణ ఎన్నికలనూ బ్యాలెట్తోనే నిర్వహించాలని స్పష్టం చేశామన్నారు. బీహార్లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు వస్తున్న అనుమానాలు, కలుగుతున్న ఆందోళనలను తొలగించాలని కోరామన్నారు. కారు గుర్తును పోలిన గుర్తులతో బీఆర్ఎస్కు జరుగుతున్న నష్టాన్ని వివరించి తక్షణమే వాటిని తొలగించాలని కోరినట్టు తెలిపారు.
ఘోష్ నివేదిక అంతా గ్యాసే
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలో మొత్తం గ్యాస్, ట్రాష్ మాత్రమే తప్ప ఏమీ లేదని కొట్టిపారేశారు. ఇవాళ హరీశ్ రావు కాళేశ్వరం మీద అన్ని వివరాలను సమగ్రంగా చెప్పారన్నారు. పూర్తి నివేదిక ఎవరూ చదవకముందే అడ్డమైన రోత వార్తలను రెండు పత్రికలు రాస్తున్నాయని, కేసీఆర్, బీఆర్ఎస్పై ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 655 పేజీల నివేదికను 60 పేజీలకు కుదించినప్పుడే కాంగ్రెస్ బాగోతం బయటపడిరదన్నారు. మైకులు కట్ చేయకుండా తమను అసెంబ్లీలో మాట్లాడనిస్తే ప్రభుత్వంతో ఫుట్బాల్ ఆడుకుంటామన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి 420 హామీలు ఇచ్చి ఒక వేలంపాటలాగా నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు సంపాదించి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎలా తప్పించుకుంటోందో ఎన్నికల సంఘానికి వివరించామన్నారు. తమ చేతుల్లో ఉన్న పనులు చేయకుండా తమ చేతుల్లో లేని రాజకీయ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ నానా యాగీ చేస్తున్నదని విమర్శించారు. ఏ ఒక్క ప్రభుత్వ కాంట్రాక్టులోనైనా 42 శాతం రిజర్వేషన్ను ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖను పెడతామన్నారు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. బీసీ సబ్ ప్లాన్ పెట్టలేదన్నారు. రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.





