తెలంగాణ రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు అసమ్మతి స్వరాలతో, అసంతృప్తి జ్వాలలతో, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నాయి. ఉద్యమ పార్టీగా ప్రత్యేకతను సంతరించుకుని సుమారు పది సంవత్సరాలు అధికారాన్ని చెలాయించిన బిఆర్ఎస్, ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో గత పది సంవత్సరాలుగా అధికార పీఠాన్ని కైవసం చేసుకుని తిరిగి ఎర్రకోటపై కాషాయ జెండానెగరేసి మూడోసారి దిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న బిజెపిలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో అతలాకుతలమవుతున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువేనని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి సహజమే అయిననూ క్రమశిక్షణకు మారుపేరుగా భావించే బిజెపి మరియు ఏకఛత్రాధిపత్యం కింద నడిచే ప్రాంతీయ పార్టీ అయిన బిఆర్ఎస్ లో కూడా రాజకీయ రచ్చ కొనసాగుతుండడం విమర్శకులను సైతం విస్మయపరుస్తున్నది.
దిల్లీ కేంద్రంగా రాజకీయాలు నడిచే ప్రధాన జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ లలో ఆశావహుల సంఖ్య కాస్త ఎక్కువే కావడం వల్ల వారంతా రాజకీయ పదవుల కొరకు, అధికార పదవుల కొరకు తహతహలాడడం సహజంగానే కనపడుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కేబినెట్ విస్తరణ అప్పుడు ఇప్పుడు అంటూ ఎప్పటికప్పుడు దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్నది. దిల్లీ చుట్టూ తిరిగినా, హైదరాబాదులో చర్చలు జరిపినా ఫలితాలు మాత్రం తేలడం లేదు. కేబినెట్ బెర్తు కేటాయించకపోతే తమ దారి తాము చూసుకుంటామని కొందరు ఎమ్మెల్యేలు బాహటంగానే తమ సన్నిహితుల దగ్గర వాపోతుండడంతో పార్టీలో కలకలం రేపుతున్నది. ఇటీవల నియమించిన కమిటీల్లో సామాజిక కోణం బహిర్గతం అవుతున్నప్పటికీ సీనియర్ జూనియర్ అనే విభేదం మాత్రం అంతర్గతంగా అగ్గి రాజేస్తూనే ఉన్నది. మరోవైపు మహిళా కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ లో తమకు సరిపడా ప్రాధాన్యత లభించడం లేదని ఇటీవల ధర్నాకు దిగడం కూడా చర్చనీయాంశంగా మారింది.
అక్కడ గెలిచింది ప్రపంచ కప్పు కాదు, కనీసం ఒక దేశం పై గెలిచిన సిరీస్ కాదు. నానాజాతి సమితి లాగా ఒక జట్టు మరొక జట్టు మీద గెలిచింది. జట్టు స్పాన్సరర్ల కర్ణాటక వారు కాదు, అందులో ఆటగాళ్లు కర్ణాటక వారు కాదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, ఆర్సీబీ జట్టులో కర్ణాటక చెందిన వారు అంతే ఉన్నారు. జట్టులో కెప్టెన్ మొదలుకొని ఉన్నవారందరూ ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల ఆటగాళ్లే. ఆర్సీబీ గెలిచింది పంజాబ్ కింగ్స్ మీద. పంజాబ్ కింగ్స్ లో కూడా ఇలాంటి నానాజాతి సమితి. ఒకప్పుడు గతంలో భారత జట్టు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్టుపై గెలిచింది అంటే దానికొక అర్థం ఉండేది.
తెలంగాణ బిజెపిలో నాయకత్వ లేమి స్పష్టంగా కనబడుతున్నప్పటికీ ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్,టీచర్ ఎమ్మెల్సీలలో తన సత్తా చాటడం ఆ పార్టీకి కాస్త ఊరటనిచ్చినప్పటికీ అంతర్గత కుమ్ములాటలతో అతలాకుతలమవుతున్నది. సాధారణంగా బిజెపిలో అంతర్గత విభేదాలు బహిర్గతం కావు. ఎన్ని విభేదాలు చోటు చేసుకున్నా, ఎంతటి వివాదం రాజుకున్నా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ లోలోపలే పరిష్కారం జరుగుతుంది. కానీ అందుకు విరుద్ధంగా తెలంగాణ బిజెపిలో మాత్రం బాహాటంగానే విభేదాలు పొడచూపుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రూపులుగా విడిపోయి వ్యవహారాలు నడిపిస్తున్నారని చర్చ జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యేల మధ్య సఖ్యత కొరవడిందని, ఎంపీలలోనూ ఏ ఇద్దరు ఒకే వేదికను పంచుకునే పరిస్థితి లేదని పార్టీ వర్గాలే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నాయి. ఇదిలా ఉండగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక విషయంలో ఇప్పటికే పెద్ద రచ్చ నడుస్తున్నది. దీంతో రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలను ఎవరికి అప్పగించాలో అధిష్టానానికి తలనొప్పిగా మారిపోయింది. ఒకపక్క కేంద్ర మంత్రిగా మరోపక్క రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు ఇంకా కిషన్ రెడ్డియే నిర్వహించడం బట్టి ఆ పార్టీలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక వ్యవహారంలో కూడా అసమ్మతి గళాలు ఇప్పటికీ వినపడుతూనే ఉన్నాయి.
ఇక బిఆర్ఎస్ పార్టీలో కవిత వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమె పలు ప్రశ్నలను సంధిస్తూ, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడంతో పార్టీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పార్టీ నాయకుడిని నేరుగా విమర్శించకుండా ఆ నాయకుడి చుట్టూ ఉన్న కోటరీపై లేఖ రూపంలో విమర్శనాస్త్రాలను సంధించడం పార్టీలో ముదురుతున్న ముసలానికి అద్దం పడుతున్నది. అటు బిఆర్ఎస్ పార్టీనే కాకుండా ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. వరంగల్ లో పార్టీ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో ఊపు మీద ఉన్న బిఆర్ఎస్ కు ఇది అశనిపాతంలా మారిందని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. బిఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేయడమో లేక బిజెపితో పొత్తు కుదుర్చుకోవడమో జరుగుతుందని దాన్ని వ్యతిరేకిస్తున్నందుననే తనను బయటకు పంపించే ప్రయత్నం జరుగుతున్నదని కవిత చేస్తున్న వ్యాఖ్యలు అధినేత కేసీఆర్ ను సైతం ఇరుకున పెడుతున్నాయి. ఇదిలా ఉండగా ఎన్నడూ లేని విధంగా హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్లడం రాజకీయ చర్చకు దారితీస్తున్నది. ఈ వారసత్వ రాజకీయాలు కింది కేడర్ కు తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అధికారం చేపట్టిన పార్టీలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉండడం సహజం. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం చాకచక్యంగా వ్యవహరించి, వారిని బుజ్జగించి వారి మధ్య సమన్వయ సహకారాన్ని నెలకొల్పాలి. అధిష్టానాన్ని ధిక్కరిస్తూ వ్యవహరిస్తే కొరడా ఝళిపించి గాడిలో పెట్టాలి. ఇక బిజెపిలో రాజాసింగ్ వ్యవహారం రోజు రోజుకు తలనొప్పిగా మారుతున్నది. బిఆర్ఎస్ లో కవిత వ్యవహారం ఆ పార్టీల పెద్దలకు కొరకరాని కొయ్యగా తయారవుతున్నది. అధికారంలోకి వచ్చి సంవత్సరం ఆరు నెలలు కావస్తున్ననూ పాలన ఇంకా గాడిన పడినట్లు కనపడడం లేదు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అరకొరగానే అమలుకు నోచుకుంటున్నాయి. దానికి తోడు పార్టీలోని విభేదాలు పార్టీని మరింత ఇరకాటంలో నెట్టుతున్నది. ఇదిలా ఉండగా అధికార పార్టీని ఎండగట్టాల్సిన ప్రతిపక్ష పార్టీలైన బిజెపి, బిఆర్ఎస్ లు అంతర్గత కుమ్ములాటలతో పార్టీని చక్కదిద్దుకోవడానికే సమయం సరిపోతున్నది. రాష్ట్రంలోని ప్రధాన మూడు పార్టీలు ధిక్కార స్వరాలపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలకు ఉపక్రమించి తమ ప్రతిష్ఠను కాపాడుకుంటాయా? లేక ఉదాసీనంగా వ్యవహరించి అప్రతిష్టపాలై చతికిలపడతాయా? అనేది కాలమే నిర్ణయించాలి. అంతవరకు వేచి చూడక తప్పదు.
– భాస్కర్ యలకంటి
సామాజిక రాజకీయ విశ్లేషకులు
చరవాణి:8919464488





