మాజీ సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాలచేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవిబిడ్డల జాతరగా తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొనసాగిన ఆత్మగౌరవ పోరాటంలో సమ్మక్క, సారలమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా నాటి సమైక్య పాలకుల ఏలుబడిలో అలజడులకు గురైన గోదావరీ లోయ పరీవాహక ప్రాంతం నేడు సాగునీటి జీవజలంతో సస్యశ్యామలమై ప్రజల జీవితాల్లో సాంత్వన నింపిందని అన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి దేశవ్యాప్తంగా తల్లుల దర్శనార్థం కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలని ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వనదేవతలను కేసీఆర్ ప్రార్థించారు.





