- సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
- ఘనంగా బిఆర్ భగవాన్ దాస్ 95వ జయంతి
- నివాళులర్పించిన ఎమ్మెల్యే నాయిని, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సిపిఐ నేతలు
హనుమకొండ, ప్రజాతంత్ర, జూన్ 8 : బిఆర్ భగవాన్ దాస్ (BR Bhagwan Das) అందించిన స్పూర్తితో ముందుకు సాగుతామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ప్రముఖ కార్మిక నేత, సీనియర్ కమ్యూనిస్టు నాయకులు కామ్రేడ్ బిఆర్ భగవాన్ దాస్ 95వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల జంక్షన్ లో గల భగవాన్ దాస్ విగ్రహానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తో కలిసి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ భగవాన్ దాస్ రాజకీయ వారసులుగా తాము ఆయన చూపిన బాటలో ప్రజల హక్కుల సాధనకు పోరాటాలు నిర్మిస్తామన్నారు. భగవాన్ దాస్ దేశంలో సమసమాజం రావాలని కోరుకున్నారని, ఆయన ఆశించిన సమాజం కోసం కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.

ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ వరంగల్ లో అసంఘటిత రంగంలో గల ఆటో, హమాళీ, బీడి, సినిమా వర్కర్స్ కార్మికుల హక్కుల కోసం సంఘాలను ఏర్పాటు చేసిన నిస్వార్థ నాయకులు భగవాన్ దాస్ అని అన్నారు. నాడు బిఆర్ తీర్చి దిద్దిన నాయకత్వం నేటికీ ఉందని, తానూ రాజకీయాల్లో భగవాన్ దాస్ స్పూర్తితో పని చేసానని, ఆయన స్పూర్తితోనే ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్నామని అన్నారు. వరంగల్ నగరంలో నేడు నిరంతరం తాగునీటి సరపరా జరుగుతుంటే అందుకు భగవాన్ దాస్ నడిపిన పోరాటాలే కారణమని అన్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో అసంఘటిత రంగ కార్మికుల హక్కులతో పాటు పేదలకు ఇండ్ల స్తలాల కోసం భగవాన్ దాస్ పోరాడారని అన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం బిఆర్ అని కొనియాడారు. నగరంలో మరో వందేళ్లు అయినా భగవాన్ దాస్ సేవలను ప్రజలు మరిచిపోరని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి,మాజీ జిల్లా కార్యదర్శి సిరబోయిన కర్ణాకర్, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్,అశోక్ స్టాలిన్, కార్పోరేటర్ లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, మాజీ కార్పొరేటర్ స్వామి చరణ్, డాక్టర్ బి. రాజ్ సిద్దార్థ, మేడిపల్లి శోభన్ బాబు, టీయూడబ్ల్యూజేే జిల్లా కార్యదర్శి తోట సుధాకర్, సిపిఐ నాయకులు మద్దెల ఎల్లేష్,వేల్పుల సారంగపాణి, నేదునూరి రాజమౌళి, కొట్టెపాక రవి,పీసరి రాము, జితేందర్, సంజయ్, డాక్టర్ బి. మేఘన, డాక్టర్ బి. ఆలయ తదితరులు పాల్గొన్నారు.





