75 – ఏండ్ల జెండా పండుగ – జాతీయభావం నిండుగ..!

(ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవాల సందర్భంగా అభివృద్ధి అవలోకనం)
ఆగష్టు 13 నుంచి 15, 2022 వరకు ఇంటింటా తిరంగా ఎగిరేయాలని, మది మదిన జాతీయతాభావం పొంగిపొర్లాలని, త్రివర్ణ పతాక ప్రొఫైల్‌ ‌పిక్స్‌ను వాడుతూ మధురానుభూతులు పొందాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పౌర సమాజానికి ‘మన్‌ ‌కీ బాత్‌’ ‌వేదికగా పిలుపు ఇవ్వడం సముచితంగా ఉన్నది. స్వతంత్ర భారతం ఎన్నో మైలు రాళ్లు దాటింది, మరెన్నో సవాళ్లను ఎదుర్కొంది, ఎదుర్కొంటున్నది. పేదరికం, అవిద్య, ప్రజారోగ్యం, సామాజిక వివక్ష, జనాభా నియంత్రణలో కొంత ప్రగతిని సాధించినా అవినీతి, ఆకలి చావులు, అసమానతల్ని అధిగమించాల్సింది ఎంతో ఉంది. భారతదేశం సగర్వంగా 75 ఏండ్ల స్వాతంత్య్ర దిన వజ్రోత్సవ సంబరాలను 15 ఆగష్టు 2022న ఘనంగా నిర్వహించడానికి ఉవ్విలూరుతున్న శుభ సందర్భమిది. గత ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ యాత్రలో అన్ని రంగాల్లో ఎంతో కొంత అభివృద్ధిని సాధించాం. అనేక ఒడుదొడుగుల నడుమ శతాబ్దాల పోరు ఫలితంగా స్వతంత్ర భరతంలో త్రివర్ణ పతాకం రెపరెరలాడటానికి మిలియన్ల ప్రాణాలను అర్పించాం, ఎన్నటికీ మాయని గాయాలను మోస్తున్నాం. మహాత్మాగాంధీ, నేతాజి, సర్దార్‌ ‌పటేల్‌, ‌వీర సావర్కర్‌, ‌నెహ్రూ లాంటి అనేక మహోన్నత నాయకుల కృషి ఫలితంగా స్వేచ్ఛా వాయువులు పీల్చాం. ప్రపంచమంతా నిద్రిస్తున్న ఘడియలో భారతం స్వేచ్ఛ గాలులు పీల్చుకుంటూ మేల్కొని 15 ఆగష్టు 1947న స్వాతంత్య్రాన్ని పొందాం. నాడు దేశంలో నెలకొన్న అనారోగ్యాలు, నిరక్షరాస్యత, పేదరికం, ఆహార కోరత, ఆర్థిక సామాజిక అసమానతలు లాంటి సమస్యలతో పాటు పెను సవాళ్ల నడుమ మనదైన తొలి భారత స్వయంపాలన ప్రభుత్వం ఏర్పడింది.

పేదరికం :
1947లో 70 శాతం పేదరికం ఉండగా 2011 గణాంకాల ప్రకారం 21.9 శాతానికి తగ్గడం హర్షదాయకమే. 2017 ప్రపంచ బ్యాంక్‌ అం‌చనాల ప్రకారం పేదరికం 8.1 – 11.3 శాతం ఉందని తెలియజేసింది. అంతర్జాతీయ నిర్వచనం ప్రకారం వ్యక్తి దినసరి ఆదాయం 1.9 డాలర్ల కన్న తక్కువగా ఉన్నపుడు పేదలుగా వర్గీకరించబడతారు. ప్రపంచ పేదరిక గడియారాన్ని అనుసరించి 2021లో పేదరికం 6 శాతమని తెలుస్తున్నది. గత 75 ఏండ్లలో పేదరిక నిర్మూలనకు మరింత కృషి జరిగే అవకాశం ఉండాల్సిందని నిపుణుల అభిప్రాయం.

నిరక్షరాస్యత :
నాణ్యమైన విద్యను, ముఖ్యంగా బాలికలకు పాఠశాల/ఉన్నత విద్య అందేలా కృషి సరిగా జరగలేదని విశ్లేషిస్తున్నారు. 1947లో అక్షరాస్యత 12 శాతం నుండి నేడు 77 శాతానికి చేరడం కొంత ఊరటను ఇస్తున్నప్పటికీ, అనువర్తిత నాణ్యమైన నైపుణ్యాలతో కూడిన విద్య నేడు కూడా అందని ద్రాక్ష అవుతున్నది. మన విద్య నాణ్యతలు అంతర్జాతీయ ప్రమాణాల స్థాయితో పోల్చితే పాతాళంలో నిలుస్తున్నాయి. నాణ్యమైన విద్య దొరకనప్పుడు ఆదాయం తగ్గడం, పేదరికం పెరగడం సహజంగా నమోదు అవుతుంది. కరోనా మహమ్మారి విజృంభనతో గ్రామీణ, పట్టణ విద్యార్థులకు మధ్య డిజిటల్‌ ‌విభేదాలు పెరగడం, గ్రామీణులకు విద్య సక్రమంగా అందక పోవడం జరుగుతోంది. దేశంలో ప్రపంచ స్థాయి ఐఐటిలు, ఐఐయంలు, యన్‌ఐటీలు, ఐఐయస్‌సి, ఐఐఐటి, కేంద్ర విశ్వవిద్యాలయాలు నెలకొల్పినా చాలా మంది యువతకు ఆశించినంతగా అవకాశం అంతగా లభించడం లేదు. అవిద్య వల్ల సమాజంలో అనేక అనర్థాలు ఉద్భవిస్తున్నాయని అంగీకరించక తప్పదు.

ఆహార కొరత :
స్వతంత్ర భారతంలో హరిత విప్లవం ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగి, అత్యధిక బియ్యం దిగుబడి చేసే స్థాయికి చేరడం, ప్రపంచంలోనే 38.5 శాతం బియ్యం ఎగుమతి (17.7 యంయంటి) చేసే స్థితికి ఎదగడం సంతోషదాయకం. బియ్యం ఉత్పత్తి పెరిగిన కొద్దీ భూగర్భజలాలు తగ్గడం చూస్తున్నాం. ఇండియాలో పేదరికం తగ్గడం, ఆహార లభ్యత పెరగడం జరిగినప్పటికీ 80 కోట్ల జనాభాకు నేడు జాతీయ ఆహార భద్రత చట్టం ద్వారా ఉచిత బియ్యం/గోధుమలు పంపిణీ చేయడం చూస్తున్నాం. భారత ప్రభుత్వం అతి పెద్ద ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణి యంత్రాంగాన్ని కలిగి ఉంది. ధాన్య సేకరణ లోపభూయిష్టంగా, అక్రమాలతో, ఖరీదైనదిగా, అసమర్థ వ్యవస్థ రాజ్యమేలుతున్న వేళ అనేక పారదర్శక సంస్కరణల కోసం నిరీక్షిస్తున్నాం. 2021 ఆర్థిక సంవత్సరంలో 31 శాతం కేంద్ర రెవెన్యూ ఆహార ధాన్యాల సబ్సీడీలకే వెళుతోంది. ఉచితాలను కొనసాగించడానికి బదులు ప్రతి ఒక్కరు స్వావలంభన దిశగా తమ కాళ్ళ మీద తాము నిలబడేలా ప్రభుత్వ పథకాలను పునర్‌ ‌సమీక్షించాల్సి ఉంది.

ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ :
విశ్వ గురువైన భారత దేశ నాగరికత వికాసంలో పతంజలి, శంకరాచార్య, చరక, సుశ్రూత, ఆర్యభట్టా, వారాహమిహిర లాంటి ఎందరో సనాతన మహానుభావులు ప్రముఖ పాత్రను వహించారు. భారతీయ సనాతన జ్ఞానంతో ఆధునిక అభివృద్ధి వెరుపులు జత కూడితేనే సుసంపన్న, సుభిక్ష భారతం సాధ్యమని తెలుసుకోవాలి. దేశంలోని 138 కోట్ల భారతీయులు రాబోయే 75 వారం పాటు (15 ఆగష్టు 2022 వరకు) మరో నూతన పోరాటం చేయాలని ‘ఫ్రీడమ్‌ ‌స్ట్రగుల్‌, ఐడియాస్‌ ఎట్‌ 75, అఛీవ్‌మెంట్స్ ఎట్‌ 75, ఆక్షన్స్ ఎట్‌ 75, ‌రిసాల్వ్ ఎట్‌ 75’ అనబడే పంచ సూత్రాలను అభివృద్ధి మంత్రాలుగా చేసుకొని అభివృద్ధి దిశగా పయనించాలని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చక్కగా సూచించారు. గత 75 ఏండ్లుగా ముందుకు సాగుతున్న భారతం మరింత వేగంగా అడుగులు వేస్తూ ‘ఆజాద్‌? ‌కా అమృత్‌ ‌మహోత్సవ్‌’‌ను ఘనంగా, సగర్వంగా, సమోన్నతంగా నిర్వహించుకుందాం. 2047లో ఘనంగా నిర్వహించుకునే భారత స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి భారతం శాస్త్రసాంకేతిక సాధనాలతో సమగ్రాభివృద్ది చెంది, పేదరికం/అవిద్య/నిరుద్యోగం/పోషకాహార లోపం లేని దేశంగా అగ్రరాజ్యాల సరసన చేరాలనే సంకల్పం తీసుకోవలసి ఉంది.

image.png

డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
 కరీంనగర్‌ – 994970003

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *