జయప్రదం చేయాలని విద్యావంతుల వేదిక విజ్ఞప్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3 : నిర్విరామంగా తన జీవిత ప్రయాణాన్ని స్వరాష్ట్ర సాధన కోసం కొనసాగించిన ఆచార్య జయశంకర్ సార్ను తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతి సంవత్సరం వారి పేరు మీద స్మారకోపన్యాస సదస్సును నిర్వహిస్తుంది. జయశంకర్ కొనసాగించిన విలువలను, ఉద్యమ స్ఫూర్తిని,సంఘటిత ఆలోచనలను, ప్రజాస్వామిక భావజాల వ్యాప్తిని మరింత ముందుకు తీసుకుపోయే క్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుండి నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ సెంటర్లో ఆచార్య జయశంకర్ 12వ స్మారకోపన్యాసాన్ని నిర్వహిస్తున్నట్లు వేదిక రాష్ట్ర నాయకులు పందుల సైదులు తెలియజేశారు.
జయశంకర్ స్మారకోపన్యాస సదస్సులో ‘అసహన రాజకీయాలు-భారతదేశం’ అంశం పై జెన్యు న్యూ దిల్లీకి చెందిన ప్రొ।। అజయ్ గుడవర్తి, సియాసత్ ఎడిటర్ జహీర్ అలీఖాన్ మొదటి సెషన్లో భాగంగా ప్రసంగిస్తారన్నారని, రెండవ సెషన్ లో ‘వర్తమాన తెలంగాణ-విద్యావంతుల కర్తవ్యాలు’ అంశం పై జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొ।। హరగోపాల్, కె.శ్రీనివాస్, ఐఏఎస్ ఆకునూరి మురళి, ప్రొ।। మురళి మనోహర్, ప్రొ।। పద్మజా షాలు ప్రసంగిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రజాస్వామికవాదులందరు హజరై జయశంకర్ ఆలోచనలను ముందుకు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేసారు.




