– ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నట్లు గుర్తింపు
ఇస్లామాబాద్,ఫిబ్రవరి2: పాకిస్థాన్లోని బలోచిస్థాన్ ప్రావిన్సులో నరమేథం కొనసాగుతోంది. పాక్ సైన్యం చేపట్టిన ఆపరేషన్కు వ్యతిరేకంగా ఆత్మహుతి దాడులు జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే వందల్లో మృతిచెందారు. బలూచిలోని 12 వేర్వేరు ప్రాంతాల్లో పెద్దఎత్తున జరుగుతోన్న దాడులకు బాధ్యత వహిస్తూ బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన వెలువరించింది. పాక్ దళాలపై దాడి చేసింది తమ విభాగానికి చెందిన ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లేనని వెల్లడించింది. వీరిలో 24 ఏళ్ల ఆసిఫా మెంగల్ అనే యువతి చేసిన దాడిలో పాక్ సిబ్బంది సహా 50 మంది మృతి చెందినట్లు తెలిపింది. మరో ఆత్మాహుతి బాంబర్ దాడిలోనూ అనేకమంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. అయితే ఆ బాంబర్ పేరును మాత్రం వెల్లడించలేదు. బలోచిస్థాన్ అంతటా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని ’హీరోఫ్’ పేరుతో రెండో దశ ఆపరేషన్ను ప్రారంభించనున్నట్లు బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆదివారం పేర్కొంది. ఈ విషయమై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ ఆత్మాహుతి దాడుల్లో ఇద్దరు మహిళా నేరస్థులు పాల్గొన్నట్లు గుర్తించామన్నారు. ఈ దాడులపై బలోచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగతీ స్పందించారు. పాకిస్థాన్ భద్రతా దళాలు 40 గంటలుగా ఉగ్రవాద ఏరివేత చర్యలు కొనసాగిస్తున్నాయని, ఇందులో భాగంగా ఇప్పటివరకు 140 మందికి పైగా వేర్పాటువాదులను మట్టుబెట్టాయని వెల్లడించారు. స్థానిక పౌరుల వేషధారణలో ఉన్న బలోచ్ రెబల్స్ పాఠశాలలు, బ్యాంకులు, మార్కెట్లు, ఆసుపత్రులలోకి ప్రవేశించి కాల్పులకు తెగబడుతున్నారని పాక్ మిలిటరీ తెలిపింది. ఏదైనా నగరం లేదా వ్యూహాత్మక స్థావరాన్ని స్వాధీనం చేసుకోవడానికి బలోచ్ రెబల్స్ ప్రయత్నాలు చేస్తున్నాయని, అయితే వాటిని తమ దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయని పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



