త్వరలోనే మరో 40వేల ఉద్యోగాల భర్తీ

– ఇప్పటికే 60వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
– హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేసేది లేదు
– తెలంగాణ ఉద్యమ జ్వాలలకు కరీంనగర్‌ ‌కేంద్రం
– ఎట్టి పరిస్థితుల్లోనూ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం
– బిఆర్‌ఎస్‌ ‌కట్టిన కాళేశ్వరం ఏమయ్యిందో చూశాం
– రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నాం
– సమర్థులనే సర్పంచ్‌లుగా ఎన్నుకోండి
– హుస్నాబాద్‌ ‌పర్యటనలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబరు 3: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వంలో ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. హుస్నాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.262.68 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఇచ్చిన హామీ మేరకు త్వరలో మరో 40వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని తెలిపారు.  శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొచ్చిన మొదటి సంవత్సరంలోనే 60వేల ఉద్యోగాలు ఇచ్చాం. ప్రజాపాలన రెండున్నరేళ్లు పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం అన్నారు. పనిచేసే వాడిని, మంచోడిని గ్రామ సర్పంచ్‌ ‌గా ఎన్నుకోవాలని రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. వీలైనంత వరకు సర్పంచ్‌లను ఏకగ్రీవం చేసుకోవాలని సూచించారు. పొంకనాలు కొట్టే వాడిని సర్పంచ్‌ గా ఎన్నుకోవద్దని చెప్పారు. ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌ ‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నెహ్రూ స్పూర్తితోనే మేం ముందుకెళ్తున్నాం. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయ్యింది. ఆనాడు ఎస్‌ఆర్‌ఎస్పీని నెహ్రూ కడితే ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఆనాడు కాంగ్రెస్‌ ‌కట్టిన ప్రాజెక్టులే దేశానికి సేవలు అందిస్తున్నాయి. రూ.2 లక్షల రుణామాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మాదే. వ్యవసాయం దండగ కాదు.. పండగ చేసి నిరూపించాం. లక్షా4 వేల కోట్లు రైతుల కోసం మా ప్రభుత్వం ఖర్చు చేసింది. మహిళలకు ఫ్రీ బస్సులే కాదు..బస్సు ఓనర్లను చేశాం. సోలార్‌ ‌పవర్‌ ‌ప్లాంట్లను ఆడబిడ్డలకు అప్పగించాం. అడిగిన ప్రతీ పేద ఇంటికి రేషన్‌ ‌కార్డు ఇచ్చాం. ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే పశువులకు దాణ పెట్టేవాళ్లు. మా ప్రభుత్వం వొచ్చాక సన్నబియ్యం ఇస్తున్నాం. ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లునిర్మిస్తున్నాం. హుస్నాబాద్‌ ‌లో దేవుళ్లేమైనా పాలించారా?. హుస్నాబాద్లో గౌరెళ్లి రిజర్వాయర్‌ ఎం‌దుకు పూర్తి కాలేదు. పదేండ్లు హుస్నాబాద్‌ ‌నిర్లక్ష్యానికి గురైంది.  గౌరెళ్లి రిజర్వాయర్లు పూర్తి చేసే భాద్యత నాది. ఆనాడు సిద్దిపేట,సిరిసిల్ల ,గజ్వేల్‌ ‌నియోజకవర్గాలే అభివృద్ధి అయ్యాయి. ఐటీఐ కాలేజీలన్నింటిని ఏటీసీలుగా మార్చాం. ఏటీసీలో చేరే ప్రతి విద్యార్థికి నెలనెలా రూ.2వేలు ఇస్తున్నాం అని రేవంత్‌ అన్నారు.

సర్దార్‌ ‌సర్వాయి పాపన్నగౌడ్‌ ‌హుస్నాబాద్‌ ‌నుంచే.. బహుజనులు దండు కట్టి ఉద్యమించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం ఇక్కడి నుంచే ఉవ్వెత్తున ఎగసిపడిందని గుర్తుచేశారు. 2004లో కరీంనగర్‌ ‌గడ్డ నుంచే తెలంగాణ ఇస్తానని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. 2014లో స్వరాష్ట్ర ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని వ్యాఖ్యానించారు. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల కరెంట్‌ ఉచితంగా ఇస్తున్నామని గుర్తుచేశారు. కేసీఆర్‌ ‌హయాంలో గజ్వేల్‌, ‌సిద్దిపేట, సిరిసిల్లలో నిధులు ఎక్కువగా ఇచ్చారని.. మిగిలిన ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. హుస్నాబాద్‌కు పదేళ్లు నిధులెందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు ఎన్ని నిధులైనా ఇచ్చి పూర్తి చేస్తామని హా ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో లాగా హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేయబోనని చెప్పుకొచ్చారు. గత పదేళ్లలో ఎవ్వరికీ డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్లు ఇవ్వలేదని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా అలస్వతం ప్రదర్శించారని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ‌హయాంలో నిర్మించిన ఎస్‌ఆర్‌ఎస్పీ ఎలా ఉందో?.. బిఆర్‌ఎస్‌ ‌కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలి. దేశంలో అత్యధికంగా వరిని పండించేది మన రాష్ట్రంలోనే. వ్యవసాయం అంటే దండగ కాదు.. పండగ అని చేసి చూపించింది మన ప్రభుత్వమే. రాష్ట్రంలో రైతుల కోసం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టాం. రాష్ట్రంలో వందలాది బస్సులకు ఆడబిడ్డలు యజమానులు అయ్యారు. 3.10 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. రూ.22,500 కోట్లు పేదల ఇళ్ల కోసం ఖర్చు చేస్తున్నాం. గజ్వేల్‌, ‌సిద్దిపేట, సిరిసిల్లలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు అన్నీ పూర్తయ్యాయి. కానీ, హుస్నాబాద్‌ ‌నియోజకవర్గంలోని గౌరెల్లి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. గత పాలకుల మాదిరిగా హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చెయ్యం. త్వరలో గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం అని సీఎం ప్రకటించారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ ‌లో రూ. 262.78 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.44.12 కోట్లతో హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్‌ ‌కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 45.15 కోట్లతో హుస్నాబాద్‌లో ఏర్పాటుతో పాటు రూ.20 కోట్లతో హుస్నాబాద్‌ ‌మునిసిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే, రూ. 8.60 కోట్లతో ఖిం యూనిట్‌ ఆఫీస్‌కు శంకుస్థాపన చేశారు. రూ. 86 కోట్లతో హుస్నాబాద్‌ అర్బన్‌- ‌కొత్తపల్లి ప్యాకేజీ-1లో భాగంగా 4 లైన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, రూ. 58.91 కోట్లతో హుస్నాబాద్‌- అక్కన్నపేట నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ‌తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌ ‌వెంకటస్వామి, శ్రీధర్‌బాబు తదితరులు సభలో పాల్గొన్నారు..


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *