– నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
– క్షతగాత్రులను హాస్పిటల్కి తరలింపు
– సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
నిజామాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలంలోని గన్నారం శివారులో ఉన్న బ్రహ్మంగారి ఆలయం సమీపంలో 44వ జాతీయ రహదారిపై టూరిస్ట్ బస్సు అర్ధరాత్రి 2 గంటల సమయంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టూరిస్ట్ బస్సు వేగంగా ప్రయాణిస్తుండగా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదం గన్నారం గ్రామ శివారులోని బ్రహ్మంగారి ఆలయం దగ్గర చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుంచి నాగ్పుర్ వెళ్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గాయపడిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. పోలీసులకు, అత్యవసర సేవలకు సమాచారం అందించారు. ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో తీవ్ర గాయాల కారణంగా వారు మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గాయపపడిన వారిని స్థానికుల సహాయంతో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఇతర పెద్ద హాస్పిటల్కు తరలించినట్లు సమాచారం. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు శ్రమించాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం అయింది. ట్రాఫిక్ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, ఇతర సాంకేతిక కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.