హైద‌రాబాద్ అభివృద్ధి వెనుక 30 ఏళ్ల శ్ర‌మ‌

– 2047 నాటికి 3 ట్రిలియ‌న్ల ఎకాన‌మీగా తెలంగాణ‌
– యువ పారిశ్రామికవేత్త‌ల‌కు ప్రోత్సాహం
– బ‌ల్క్ డ్ర‌గ్స్ లో 40 శాతం తెలంగాణ‌లోనే ఉత్ప‌త్తి
– స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికే ప్రాధాన్యం
– ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9: హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడగలుగుతోంది అంటే ముప్ప‌య్యేళ్ల (1995 నుంచి 2025 వరకు) నిరంతర శ్రమ వల్లేన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. జర్మన్ టెక్నాలజీతో దక్షిణ భారత దేశంలోనే హైద‌రాబాద్‌లో ఐవీ ఫ్లూయిడ్స్ తయారీలో గొప్ప సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమ‌ని  ప్ర‌శంసించారు. సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్ర‌వారం ప్ర‌సంగిస్తూ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో భావనగా సుజెన్ మెడికేర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషం, గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్ ను విడుదల చేశామ‌న్నారు. క్యూర్, ప్యూర్, రేర్ మూడు భాగాలుగా రాష్ట్ర‌ అభివృద్ధి ఉంటుంది. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమిగా తెలంగాణను తీర్చి దిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు.ప్రపంచంలోని గొప్ప నగరాలతో హైదరాబాద్, తెలంగాణ పోటీ పడుతోంది. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూయార్క్ లతో తెలంగాణ పోటీ పడుతోంది. అందులో భాగంగా యువ పారిశ్రామిక వేత్తలు ప్రారంభించే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామ‌న్నారు. దేశంలో ఉత్పత్తి చేసే బల్క్ డ్రగ్స్ లో 40 శాతం తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచమే మనవైపు చూసేలా ఫార్మా రంగంలో రాణిస్తున్నాం. మనదగ్గర చదువుకుని వెళ్లిన వారు గ్లోబల్ కంపెనీలకు సీఈవోలుగా వుండ‌టం మనకు ఎంతో గర్వకారణమ‌న్నారు. నిరుద్యోగుల కు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

రాష్ట్రానికి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా?

రాష్ట్రానికి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. వివాదం కావాలా? పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారం కావాలని కోరుకుంటాన‌న్నారు. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ది పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. రాజకీయాలకతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాన‌న్నారు. మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా.. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు అడ్డంకులు పెట్టకండి. అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వ నిధులు రావడంలేదు.. రాష్ట్రంపై ఆర్ధిక భారం పడుతోంది. మేం వివాదం కోరుకోవడంలేదు.. పరిష్కారం కోరుకుంటున్నాం. రాజకీయ ప్రయోజనాలు కాదు ప్రజల ప్రయోజనాల కోసం, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నామ‌న్నారు. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాలి. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇందుకోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతా య‌న్నారు. పక్క రాష్ట్రాలతో మేం వివాదాలు కోరుకోవడం లేదన్నారు. అది ఏపీ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, మహారాష్ట్ర అయినా పరస్పర సహకారమే కోరుకుంటున్నామ‌న్నారుజ. రాబోయే పదేళ్లల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఉంటున్నామని గర్వంగా చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామ‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *