- బొల్లారంలో ఐదురోజుల పాటు ద్రౌపది ముర్ము బస
- ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
- 28న భద్రాచలం, రామప్ప సందర్శన
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 : భారతదేశ ప్రథమ పౌరురాలు..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దక్షిణాది విడిది ఖారరాయ్యింది. ఆమె ఈ నెల 26న సికింద్రాబాద్ బొల్లారం విడిదికి రానున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. దీంతో బొల్లారంలో పూర్తిస్తాయి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచే ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా ఈ నెల 28 న భద్రాచలం వెళ్లనున్నారు. రామయ్య దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాద్ పథకాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ కార్యక్రమాలతో రాష్ట్రపతి బిజీగా గడపనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఆమె భద్రాచలం చేరుకుంటారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుంటారు.
ఆలయ మాడవీధి నుంచి వీఐపీ మార్గంలో వాహనాల రాకపోకలు ఇబ్బంది లేకుండా మెట్లను తొలగించాలని నిర్ణయించారు. అయితే.. 23 నుంచి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు జరగనున్నాయి. 1965 జులై 13న అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా గోదావరి వంతెన జాతికి అంకితమైంది. ఆ తర్వాత కాలంలో భద్రాచలంకు రాష్ట్రపతి రావడం ఇది రెండోసారి. 28న మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల వరకు వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ సైతం ప్రసాద్ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖకి సంబంధించిన ప్రాజెక్టులకు రాష్ట్రపతి శంకుస్థాపన చేస్తారు.




