న్యూ దిల్లీ, జనవరి 31 : కాలుష్య నివారణతో పాటు రోడ్డు ప్రమాదాల తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ బలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పాత వెహికల్స్ను తుక్కుగా మార్చేందుకు వెహికల్ స్క్రాపేజ్ పాలసీని కేంద్రం ప్రకటించింది. అలాగే 15ఏళ్లు పైబడిన అన్ని ప్రభుత్వ వాహనాల వాడకాన్ని ఏప్రిల్ 1 నుంచి ఆపేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. తాజాగా దీనిపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టమైన ప్రకటన చేశారు.పరిశ్రమల సంస్థ ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో సోమవారం పాల్గొన్న గడ్కరీ.. 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన తొమ్మిది లక్షలకు పైగా వాహనాలు ఏప్రిల్ 1 నుంచి రోడ్డెక్కవని చెప్పారు. వాటి స్థానంలో కొత్త వాహనాలు రానున్నాయని తెలిపారు. అలాగే ఇథనాల్, మిథనాల్, బయో-సీఎన్జీ, బయో-ఎల్ఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
‘15 సంవత్సరాలు పైబడిన తొమ్మిది లక్షలకు పైగా ప్రభుత్వ వాహనాలను స్క్రాప్ చేయాలని నిర్ణయించాం. కాలుష్యానికి కారణమయ్యే అన్-ఫిట్ బస్సులు, కార్లు రోడ్డెక్కవు. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధనాలతో కొత్త వాహనాలు వస్తాయి. దీని వల్ల వాయు కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది’ అని గడ్కరీ వెల్లడించారు. ఈ విషయానికి సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి 15 సంవత్సరాల కంటే పాతవైన ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలోని బస్సులతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. రక్షణ విభాగం, శాంతిభద్రతల పర్యవేక్షణ, ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం ఉపయోగించే స్పెషల్ పర్సప్ వెహికల్స్(సాయుధ, ఇతర ప్రత్యేక వాహనాలు)కు ఈ రూల్ వర్తించదు.
రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి 15 ఏళ్లు దాటిన ఇలాంటి వాహనాలను మోటార్ వెహికల్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ) రూల్స్-2021కు అనుగుణంగా ఏర్పాటు చేసిన రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్లో డిస్పోజ్ చేయాలని నోటిఫికేషన్ పేర్కొంది. 2021-22 బడ్జెట్లో కేంద్రం ఈ పాలసీని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం పర్సనల్ వెహికల్స్కు 20 ఏళ్ల తర్వాత, కమర్షియల్ వెహికల్స్కు 15 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ టెస్ట్లు చేస్తారు. ఫిట్నెస్ లేని వాటిని తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. ఈ పాలసీ 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆటోమొబైల్ స్క్రాపింగ్ ఫెసిలిటీలో పాత వాహనాలను తుక్కుగా మార్చుకోవచ్చు. ఆ తర్వాత కొనుగోలు చేసిన కొత్త వాహనాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 25 శాతం వరకు రోడ్డు ట్యాక్స్ రాయితీని అందిస్తాయి.




