12 ఎంపి స్థానాలు గెల్చుకుంటున్నాం

బిజెపికి రాష్ట్రంలో తిరుగులేదు
మల్కాజిగిరిలో ఈటల భారీ మెజార్టీతో గెలుపు
సికింద్రాబాద్‌లో నా గెలుపును ఎవరూ ఆపలేరు
ఈటల నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తాము ఎవరికీ బీ టీం కాదని చెప్పారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, మల్కాజిగిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ నామినేషన్‌ ర్యాలీ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో 12కు పైగా స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుందని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా ఈటల అనేక ఉద్యమాలు చేశారని.. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని చెప్పారు. మల్కాజిగిరిలో ఆయన్ను గెలిపిద్దామన్నారు. ఐకమత్యంతో పనిచేయాలని కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు. నామినేషన్‌ వేసిన తర్వాత డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ చేయాలని అధిష్ఠానం సూచించిందని..  కేడర్‌ అంతా ప్రచారంలో పాల్గొనాలన్నారు. ఇప్పటి వరకు దేశానికి ఏం చేశాం.. ఏం చేయబోతున్నామనేది ప్రజలకు వివరించాలని చెప్పారు.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా కీలకమని.. అక్కడ పార్టీ అభ్యర్థి వంశ తిలక్‌ను గెలిపించాలని కోరారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని.. ఈ విషయంలో తనకు పూర్తి విశ్వాసముందన్నారు. కాంగ్రెస్‌ ఏం చేసినా తమ గెలుపును ఆపలేదని చెప్పారు. ఈటల రాజేందర్‌ నామినేషన్‌ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈటల తన నివాసం నుంచి పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఊరేగింపుగా బయల్దేరారు. మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఈటల రాజేందర్‌తో పాటు మరో నలుగురు నేతలను మాత్రమే లోపలికి అనుమతించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా లోక్‌సభ ఎన్నికల్లో తన గెలుపును ఎవరూ ఆపలేరని కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ ఎంపీగా మరోసారి ప్రజలు తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం నాడు ప్రజానివేదికలో భాగంగా కార్యకర్తలతో సమావేశం అయ్యారు. లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ పార్టీ కేడర్‌కు దిశానిర్ధేశర చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… తాను పని చేశానని అనిపిస్తేనే వోటు వేయాలని కోరారు. తనకు వోటు వేసిన ప్రజలు తలదించుకునే పని ఇంతవరకు చేయలేదన్నారు. తాను ఒక్క రోజు కూడా సమయం వృథా చేయకుండా ప్రజల కోసం పనిచేశానని తెలిపారు. తన నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. తాను పనులు ఇచ్చిన కాంట్రాక్టర్‌ మొహం కూడా ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు. తన నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసమే పని చేశానని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, గత మంత్రులు కూడా తనను అసభ్యంగా ధూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడిరచారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హావ్నిలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తాను పని చేశానని భావిస్తేనే వోటేయండి.. పనిచేయలేదు అనుకుంటే వోటు వేయొద్దన్నారు. తన పార్టీ సహకారం, కార్యకర్తలు, ప్రజల కృషితోనే తాను గెలిచానని అన్నారు. మరోసారి సికింద్రబాద్‌ ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిపారు. మరోసారి తనను ఆశీర్వదించి సికింద్రాబాద్‌ ఎంపీగా గెలిపించాలని కిషన్‌రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *