- పోడు భూములపై మాది ప్రత్యేక విధానం
- డవులను నరికి ఎడారిగా మారుస్తున్నారు
- గుత్తికోయలతో నరికి వేయిస్తున్నారు
- దళిత బంధు తరహాలో గిరి పుత్రులకు గిరిజన బంధు
- అసెంబ్లీలో వెల్లడించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : పోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయని చెప్పారు. శుక్రవారం పోడుభూములపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటన చేస్తూ…పోడుభూములపై ప్రతిసారి రాజకీయం చేయడం సరికాదని ముఖ్యమంత్రి సూచించారు. అటవీ భూములపై ఇప్పటికే నివేదికలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. అన్ని పార్టీల నేతలు ఒప్పుకుంటే 11.5 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తామన్నారు. గుత్తికోయలను తీసుకువచ్చి అడవులను నరికివేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అటవీ అధికారులపై దాడులు సరికాదన్నారు. గిరిజనులకు గత పాలకులు చేసిన మోసాలు అందరికీ తెలుసన్నారు. పోడు భూములు అనేవి హక్కు కాదు? దురాక్రమణ అని స్పష్టం చేశారు. విచక్షణారహితంగా అడవులను నరికేయడం సరికాదన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. పోడు, అటవీ భూములు పలువురికి ఆటవస్తువులా తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గిరిజనులపై దౌర్జన్యం జరుగకుండా చూడాలని సూచించారు. కొందరు అగ్ర కులస్థులు గిరిజన యువతులను పెండ్లి చేసుకుంటున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పలువురు ఉన్నత కులాలవారు అటవీ భూములను కబ్జాచేశారన్నారు. 10, 20 ఎకరాల పోడు భూములు ఎవరికైనా ఉంటాయా అని ప్రశ్నించారు. గిరిజనుల హక్కులు కాపాడాల్సిందేనని, అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా, కనుమరుగు కావాలా అని ప్రశ్నించారు. నర్సాపూర్ అడవి ఎలా ఎడారైందో మనమంతా చూశామన్నారు. అడవుల పునరజ్జీవనం చేసే పక్రియ కొనసాగుతున్నదని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో 7.8 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని ప్రశంసలు వొస్తున్నాయని చెప్పారు. పోడు భూముల విషయంలో తమకు స్పష్టత ఉందన్నారు. పోడు భూముల సర్వే పూర్తయిందని వెల్లడించారు.
ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు సాగుచేసుకుంటున్న వారికి పట్టాలు ఇస్తామని వెల్లడించారు. అయితే భూములు తీసుకున్న గిరిజనులు ఇకనుంచి అడవులను రక్షిస్తామని హావి• ఇవ్వాలన్నారు. చెట్లు నరకబోమని సంతకాలు పెడితేనే భూములు పంచుతామని చెప్పారు. తీర్మానానికి ముందుకురాని గ్రామాలకు పట్టాలిచ్చేది లేదన్నారు. భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని, పట్టాలను రద్దుచేస్తామని స్పష్టం చేశారు. భూమిలేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామన్నారు. గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడిచేయవద్దని సూచించారు. అదేసమయంలో అధికారులపైనా గిరిజనుల దాడులు సహించబోమన్నారు. గుత్తికోయల గూండాగిరి మంచిది కాదని చెప్పారు. అడవిని నరికేసి భూములు ఇవ్వండని అడగడం సబబుకాదని వెల్లడించారు.
ఇకనుంచి అటవీ ప్రాంతంలోని ఒక్క చెట్టును కూడా కొట్టనివ్వమని చెప్పారు. అడవుల నరికివేతకు ఎక్కడోచోట ఫుల్స్టాప్ పడాలన్నారు. గజం అటవీ భూమి కూడా ఆక్రమణకు గురికావొద్దని, ఆక్రమణను సర్కార్ సహించదని తెలిపారు. అటవీ సరిహద్దులు పెట్టి సాయుధ దళాలతో పహారా ఏర్పాటు చేస్తామని తెలిపారు. గిరిజనుల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు. అడవుల రక్షణ అనేది మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. వాల్మీకి బోయలు, బేదర్, కిరాతక, నిషాధి, పెద్దబోయలు, తలయారి, చుండువాళ్లు, ఖయీతి లంబాడ, భాట్ మధురాలు, చమర్ మధురాలను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకుముందు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
దళితబంధు తరహాలో గిరిజనబంధు
దళితబంధు తరహాలోనే గిరిజనబంధు కూడా అమలు చేస్తామని సిఎం కెసిఆర్ మరోమారు స్పష్టం చేశారు. తాము ఇచ్చిన హావి• మేరకు దీనిని అమలు చేస్తామన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు కూడా ఇస్తామని స్పష్టం చేశారు.



