- దసరా నుంచి ముఖ్యమంత్రి అల్పాహార పథకం
- సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : తెలంగాణ రాష్ట్ర సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. దసరా కానుకగా, అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో(1 నుంచి 10వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ‘‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం(చీఫ్ మినిస్టర్స్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్) అందించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. తద్వారా విద్యార్థులకు చక్కని బోధనతో పాటు మంచి పోషకాహారం అందిచే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నది. తద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టింది. ఉదయాన్నే వ్యవసాయం పనులు, కూలీపనులు చేసుకోవడానికి వెల్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సిఎం కేసీఆర్ మానవీయ ఆలోచనకు అద్దంపట్టే దిశగా ఈ అల్పాహారం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం దసరా నుంచి అమలు చేయనున్నట్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
సిఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది. కాగా..తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకం విధానాన్ని పరిశీలించి రావాలని ఐఎఎస్ అధికారుల బృందాన్ని సిఎం కేసీఆర్ ఇటీవలే పంపించారు. కాగా అక్కడ విజయవంతంగా అమలవుతున్న ‘విద్యార్థులకు అల్పాహారం పథకం’ను అధ్యయనం చేసిన అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించింది. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అమలు చేస్తున్నారనే విషయాన్ని సిఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చింది. కాగా విద్యార్థుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించే సిఎం కేసీఆర్ ఖర్చుకు వెనకాడకుండా ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా బ్రేక్ ఫాస్టును అందచేయాలని నిర్ణయించారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ప్రతి యేటా దాదాపు రూ.400 కోట్ల అదనపు భారం పడనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.




