- కానీ మన గజినీలకు అర్థం కావట్లేదు
- ఎన్ని డిక్లరేషన్లు ఇచ్చినా ప్రజలు నమ్మరు…
- బిఆర్ఎస్కు వోటేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారు
- కొల్లూరులో రెండవ విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో మంత్రి తన్నీరు హరీష్ రావు
పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : హైదరాబాద్ అభివృద్ధి గురించి సూపర్ స్టార్ రజినీకాంత్కు అర్థమైంది కానీ, మన దగ్గర ఉన్న గజినీలకు అర్థం కావడం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో రెండవ విడత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 9 నియోజకవర్గాలకు చెందిన 4800 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…హైదరాబాద్లో లక్ష మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రతి పేదవాడికి పక్కా ఇండ్లు ఇస్తామని, పేదలు ఆత్మగౌరవంతో ఉండేలా చేస్తామని మంత్రి భరోసానిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇండ్లు కట్టడం అంటే అప్పుల్లో కూరుకుపోవడమే అన్నట్లుగా ఉండేదన్నారు. గోదావరి, కృష్ణా జలాలను తీసుకొచ్చి హైదరాబాద్లో తాగునీటి కొరతను సీఎం కేసీఆర్ తీర్చారని చెప్పారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఈ పని చేయలేకపోయాయని అన్నారు. పేదలందరికీ ఉచితంగా మంచినీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ చాలా పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ కిట్లు ఇస్తే, ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు తప్ప ఏమీ జరగలేదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలే ప్రచారం చేయాలని అన్నారు. ఎన్నికలు వొస్తున్నాయంటే హామీలు, నినాదాలు చేస్తూ మీ దగ్గరికి వొస్తుంటారని అన్నారు. దొంగ డిక్లరేషన్ చేస్తూ వోట్ల కోసం వొస్తున్నారన్నారు. ఎన్ని డిక్లరేషన్లు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే వోట్లు వేస్తామని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని స్పష్టం చేశారు. కొల్లూరు టౌన్షిప్లో విద్య, వైద్యం, రవాణా సదుపాయం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఎవరికి ఏ బ్లాక్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వొచ్చిందనేది కంప్యూటర్ ద్వారా కేటాయింపు జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి జనాలకు కిట్లు ఇస్తుంటే, కాంగ్రెస్, బీజేపీ నాయకులు తిట్లు ఇస్తున్నారని విమర్శించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయని పనులు 10 ఏళ్ళలో టీఆర్ఎస్ సర్కార్ చేసి చూపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ మల్లెపల్లి లలిత సోమిరెడ్డి, అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బాలగౌని రాములు గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


