• 1500 కంపెనీలకు నిలయంగా నగరం
• ప్రముఖ కంపెనీల లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ల ఏర్పాటు
• 2.41 లక్షల కోట్ల ఎగుమతులతో 9.05 లక్షల మందికి ఉద్యోగాల కల్పన
• టైర్-2 నగరాలలో ఐటి టవర్ల ఏర్పాటుతో పెరిగిన ఉద్యోగ అవకాశాలు
• రాష్ట్రానికి, నగరానికి తలమానికంగా టి హబ్లు
• సిఎం కెసిఆర్ దార్శనిక నిర్ణయాలు, అభివృద్ధి ప్రణాళికలతోనే సాధ్యం
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దార్శనిక నిర్ణయాలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్నది. దాదాపు 1500 ఐటి, ఐటిఈఎస్ కంపెనీలకు నిలయంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ సత్వర నిర్ణయాలు, అభివృద్ది ప్రణాళికలతో తెలంగాణ ఏర్పడేనాటికి ఐటి ఎగుమతుల విలువ రూ.57, 258 కోట్లు ఉంటే 2022-23 నాటికి రూ. 2,41,275 కోట్లకు చేరి 9,05,715 మందికి ఉద్యోగాల కల్పన జరిగింది. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో 5.60 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. గత సంవత్సరంతో పోల్చితే ఎగుమతులలో 31.44 శాతం వృద్ది సాధించింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అమెజాన్ డేటా సర్వీసు సెంటర్ రూ.20,761 కోట్లతో ఫాబ్ సిటీ, ఫార్మా సిటీ , చందన్ వెల్లిలలో 3 డేటా సెంటర్లను నెలకొల్పుచున్నది. నేషనల్ పే మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 500 కోట్లతో స్మార్ట్ డాటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నది. సేల్స్ ఫోర్స్ రూ.1119 కోట్లతో విస్తరణ చేపట్టింది.
గోల్డ్ మాన్ శాబ్స్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు ద్వారా 2500 మందికి ఉద్యోగాలు లభించాయి. అమెరికన్ ఇన్సూరెన్స్ దిగ్గజ కంపెనీ మాసాచూసెట్ మ్యూచువల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ 1000 కోట్లతో గ్లోబల్ కెపాబులిటీ సెంటర్ ఏర్పాటును ప్రకటించింది. ఒప్పో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నది. ప్రముఖ కంపెనీలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది.కార్పొరేట్ రంగంలో ప్రముఖ కంపెనీలు తమ లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ లను హైదరాబాద్ నందు ఏర్పాటు చేస్తున్నాయి. రాజకీయ సుస్థిరత, సమర్ధ నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు ‘బ్రాండ్ హైదరాబాద్’ను కాపాడటమే కాకుండా మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో ఐటి రంగాన్ని వికసింపచేశాయి. భారత దేశపు ఐటీ రంగం స్థూల అభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధిరేటు ప్రతీ యేడూ అధికంగానే ఉంటూ వస్తున్నది.
ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ 19 మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని కూడా తట్టుకుని తెలంగాణ ఐటీ రంగం పురోగమించింది. భారతదేశ సిలికాన్ వ్యాలీగా, ఐటి క్యాపిటల్గా ప్రసిద్ధిగాంచిన బెంగుళూరును అధిగమిచే దిశగా తెలంగాణ ఐటి రంగం దూసుకెళ్తున్నది. యాపిల్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, ఉబర్, మైక్రాన్, స్టేట్ స్ట్రీట్, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ , ఫియట్ క్రిస్లర్, మాస్ మ్యూచువల్, ఇంటెల్, ప్రొవిడెన్స్, గోల్డ్ మ్యాన్ సాచ్స్, జెడ్ఎఫ్, యు బిఎస్, పెప్సి, లేగటో లాంటి కంపెనీలను ఆకర్షించడంతో పాటు ఫేస్ బుక్, క్వాల్కామ్, అక్సెంచర్, వేల్స్ ఫార్గో, క్సిలినిక్స్, మైక్రోసోఫ్ట్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, టీసీఎస్, ఐబీఎం, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్, విప్రో తమ కార్యకలాపాలు విస్తరించాయి. ఐటి రంగం అభివృద్ధి మిగతా రంగాలైన నిర్మాణ రంగం, రవాణా రంగం, వినోద రంగాలపై ప్రభావం చూపెడుతుంది. ఒక పక్క ఐటి రంగంలో దూసుకుపోతుండగా టైర్-2 నగరాలలో ఐటీ టవర్ల నిర్మాణంతో కొత్త కంపెనీలు ఏర్పాటయ్యి స్టానిక యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
టి హబ్ స్వరూపం-విజయ ప్రస్థానం
స్టార్టప్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం టి హబ్ 1, టి హబ్ 2 లను నెలకొల్పింది. ఈ వేదికలు నేడు తెలంగాణ రాష్ట్రానికి, ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలిచాయి. సాంకేతికరంగంలో పై టీ హబ్ లు సృష్టిస్తున్న అద్భుతాలు నేడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
టీ హబ్ 1 : ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్లండి అనే నినాదంతో స్టార్టప్లకు ఇంక్యుబేటర్ టీ హబ్ 1 ను 2015 నవంబర్ 5 న గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటి క్యాంపస్ లో ప్రారంభం అయింది. దేశంలో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ గానే కాదు, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టార్టప్ హబ్ గా నిలిచింది. టీ-హబ్ ద్వారా రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి సాధిస్తున్నది. అతి స్వల్ప సమయంలోనే టీ హబ్ దేశ విదేశాలలో ప్రముఖుల ప్రశంసలు పొందింది.
టీ హబ్ 2 : 400 కోట్ల రూపాయలతో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ 2 ను ప్రపంచలోనే అతిపెద్దదైన స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్గా భారీస్థాయిలో నిర్మించడం జరిగింది. దీని కోసం రూ.276 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. ఆవిష్కరణ(ఇన్నోవేషన్), మౌలిక సదుపాయాలు(ఇన్ ఫ్రాస్ట్రక్చర్), సమ్మిళిత వృద్ధి(ఇన్ క్లూజివ్ గ్రోత్) అనే ‘త్రీ ఐ’ సూత్రాలు అమలు చేయడమే లక్ష్యంగా టి హబ్ 2ను స్థాపించం జరిగింది.
టీ ఫైబర్ ప్రాజెక్ట్ (ఫైబర్ గ్రిడ్ పథకం)
తెలంగాణ ప్రభుత్వ ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో టీ ఫైబర్ ప్రాజెక్ట్(ఫైబర్ గ్రిడ్ పథకం) ను ప్రవేశ పెట్టింది. దేశంలోనే ప్రప్రథ•మంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథ•కమిది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న ఆన్లైన్ సేవలను ప్రజలు సులువుగా పొందవచ్చు. టెలికాం ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం ద్వారా టి-ఫైబర్ ప్రాజెక్ట్ను తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నది. గ్రామ పంచాయతీలు, గ్రామీణ గృహాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు నెట్వర్క్ను అనుసంధానించడం ద్వారా ఇది సేవలు అందిస్తున్నది.
ఫేజ్-1లో భాగంగా 33 జిల్లాలు, 12769 గ్రామపంచాయతీలు, 142 పట్టణ స్థానిక సంస్థలు 30,000 ప్రభుత్వ సంస్థలకు ఇంటర్నెట్ సదుపాయాలను కల్పిస్తున్నది. మరో 50 వేల ప్రభుత్వ సంస్థలకు ఇంటర్నెట్ కల్పించే దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలు, వ్యాపార సంస్థలకు మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు డిజైన్ చేయబడిన టీ-ఫైబర్కు ఐసిటి ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డిజిటల్ ఇండియా విభాగంలో నాలెడ్జ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (కేసీసీఐ) బిజినెస్ ఎక్సలెన్స్ -2022 అవార్డు లభించింది.
టీ వర్కస్ :
టీ వర్కస్ ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతిపెద్ద ప్రో టైపింగ్ సెంటర్, ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్ళండి. అనే నినాదంతో వర్కస్ రూపొందింది. పైసా ఖర్చు లేకుండా ఆవిష్కర్తలు తమ సరికొత్త ఆలోచనల మేరకు ఉత్పత్తులను ఆవిష్కరించుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్, ఈవి రంగాల విస్తరణకు అవసరమయ్యే ఏకొ సిస్టమ్ ను అభివృద్ది చేస్తున్నాయి. ఫాక్స్ కాన్ మాన్ ఫ్యాక్చర్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం న్యూ ఎలక్ట్రానిక్ హబ్గా అవతరిస్తున్నది. ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్, బ్లాక్ చైన్, క్లౌడ్, డ్రోన్స్, ఐఓటి, రోబోటిక్స్, స్పేస్ టెక్నోలజీలపై ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నది.
– స్పెషల్ కమిషనర్, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖచే జారీచేయనైనది




