- గణేశ్ ఉత్సవాలతో స్వాతంత్య్రపోరాటంలో కర్తవ్యోన్ముఖం
- వినాయక నిమజ్జనంలో నిర్లక్ష్యంగా ప్రభుత్వం తీరు
- ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న బండి తదితరులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: దేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికే బాలగంగాధర్ తిలక్ ఆనాడు వినాయక నవరాత్రులని ఏర్పాటు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందూ సమజాన్ని ఏకం చేయడంతో పాటు, స్వాతంత్రోద్యమంలో వారిని కర్తవ్యోన్ముఖులను చేశారని అన్నారు. ఖైరతాబాద్ భారీ గణపతిని ఆ పార్టీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్,చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏకదంతుడికి 110 అడుగుల కండువా బహుకరించారు.కులాలు, వర్గాలు, ప్రాంతాల పేరుతో విడిపోయిన హిందూ సమాజాన్ని ఏకం చేయటానికే గణనాధుడి నవరాత్రులు నిర్వహించటం జరుగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఆనాడు దేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికే బాలగంగాధర్ తిలక్ వినాయక నవరాత్రులని ఏర్పాటు చేశారని బండి సంజయ్ అన్నారు. ఈ వేడుకల ద్వారా హిందూ సమాజం సంఘటిత శక్తి నిరూపితమైందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏకదంతుడికి 110అడుగుల కండువా, 25 కిలోల లడ్డూను భాజపా నేతలు బహుకరించారు. గణెళిష్ నిమజ్జనానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో గణెళిష్ ఉత్సవాలు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల పేరుతో ఉత్సవాలను అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. అడ్డుకుంటే.. వినాయకుడి నిమజ్జనం ప్రగతి భవన్ లో చేస్తామన్నారు. శాంతి భద్రతల అంశం సృష్టించి రాజకీయంగా లబ్ది పొందేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడంలో సీఎస్ సోమేష్ కుమార్ నెంబర్ వన్ అన్నారు. నిమజ్జనంపై భాగ్యనగర్ గణెష్ ఉత్సవ కమిటీ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తామన్నారు. లౌడ్ స్పీకర్లపై చర్చకు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఉపాధ్యాయుల దినోత్సవం రోజు కూడా టీచర్స్ ను గౌరవించే ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదని బండి సంజయ్ అన్నారు. ఇలా చేస్తే విద్యార్థులకు ఏ సందేశం పంపుతారని బండి సంజయ్ నిలదీశారు. ఇదేనా ఉపాధ్యాయుల పట్ల సీఎంకు ఉన్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన టీచర్స్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.



